తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ

4 Nov, 2019 15:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసంలో మొదటి సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.  తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు.  అభిషేకాలు నిర్వహించి, కార్తీక దీపాలు వెలిగించారు. 

సూర్యలంక సముద్ర తీరంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరాన పంచభూతాలకు ఆయన కర్పూర హారతి ఇచ్చి, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు కోన రఘుపతి.  మరోవైపు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

గుంటూరు 
కార్తీక మాసం తొలి సోమవరాం, కోటి సోమవారం సందర్భంగా జిల్లాలోని నరసరావుపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండపై ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.  త్రికోటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున నుంచి మూలవిరాట్‌కు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కోటి సోమవారం సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. అమరావతిలో తెల్లవారుజాము నుంచే నదీ స్నానం చేసి భక్తులు అమరలింగేశ్వరుడుని దర్శించుకుంటున్నారు

వైఎస్సార్ జిల్లా:
హిందువుల పవిత్ర కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా రాజంపేట డివిజన్లలో ఉన్న ఆత్త్తిరాల త్రేతేశ్వర, ఊటుకూరు భక్తకన్నప్ప ఆలయం, రాజంపేట రామలింగేశ్వర ఆలయంలో శివ భక్తులు బారులు తీరారు. ఆలయాల్లో శివ నామస్మరణతో పంచాక్షరి మంత్రం మారు మోగితోంది. 

నెల్లూరు జిల్లా
కార్తీక సోమవారం సందర్భంగా  జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. జిల్లీలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. కావలి శివాలయంలో హరి హర నామస్మరణలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. రామతీర్థం.. కాటపల్లిలలో భక్తులు సముద్ర స్థానాలు ఆచరిస్తున్నారు. 

కర్నూలు 
కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీశైలం దేవస్థానం  భక్తులు తో పోటెత్తింది. వేకువ జామునుండే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నేటి సాయంత్రం లక్ష దీపోత్సవం కార్యక్రమం జరగనుంది. 

తూర్పు గోదావరి 
కడియం మరియు రాజమండ్రి రూరల్ మండలాల్లో  కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో వేకువజాము నుంచే శివాలయాలు కిటకిటలడాయి.ముమ్మిడివరం మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి నిత్యకళ్యాణం పచ్చతోరణంతో విరాజిల్లుతున్నాడు. ముమ్మిడివరం శ్రీఉమాసూరేశ్వరస్వామి, కుండలేశ్వరం శ్రీపార్వతీ కుండలేశ్వర స్వామి వారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.  దక్షిణ కాశీ  శ్రీమాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి  ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. సప్తగోదావరిలో స్నానం ఆచరించి భక్తులు కార్తీక దీపాలు వదిలారు.

పశ్చిమగోదావరి :
పాలకొల్లు పంచారమ క్షేత్రం శ్రీ క్షీరా రామలిబుగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. భక్తులు తెల్లవారు జామున నుండి స్వామి వారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు. భీవవరంలోని పంచారామ క్ష్రేత్రంలో భక్తులు పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు