కౌడిపల్లి, న్యూస్లైన్ :
అనుమానాస్పద స్థితిలో మండలంలోని చిట్కుల్కు చెందిన గడీల రత్నమ్మ (70) గురువారం దారుణహత్యకు గురైంది. అయితే ఆస్తి కోసమే మనువడు హత్య చేసి ఉంటారని బంధువులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ నాగార్జున గౌడ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన గడీల రత్నమ్మ భర్త, కుమార్తెలు చనిపోవడంతో ఉన్న రెండెకరాల సాగు భూమిని కౌలుకు ఇచ్చి పెంకుటింటిలో నివాసముంటోంది. కాగా.. రత్నమ్మ బావ కుమారుడి కొడుకు, వరుసకు మనువడు అయిన మహేష్గౌడ్, అతడి తల్లి దుర్గమ్మలు ఓ గుడిసెలో నివాసముంటున్నారు. అయితే రత్నమ్మ ఇంటికి పక్కనే ఉండడంతో నిత్యం ఆమె ఇంట్లో రాత్రిళ్లు మహేష్, దుర్గమ్మలు పడుకునేవారు. బుధవారం కూడా అదే విధంగా పడుకున్నారు. అయితే గురువారం తెల్లవారే సరికి రత్నమ్మ మృతి చెందింది. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న రత్నమ్మ మృతి చెందడంపై.. మహేష్ గౌడ్, దుర్గమ్మలపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలు రత్నమ్మకు చెందిన పాడి గేదెల్లో ఒకటి నెలరోజుల క్రితం, రెండోది.. వారం రోజుల క్రితం తప్పిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఎవరూ లేని వృద్ధురాలిని చంపితే ఆస్తి, ఇల్లు తమకే వస్తుందన్న ఉద్దేశంలో చంపి ఉంటారని గ్రామస్తులు, బంధువులు ఆరోపిస్తున్నారు.