కొత్త వత్సరానికి ఘన స్వాగతం

2 Jan, 2019 10:35 IST|Sakshi

బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): కొత్త సంవత్సరానికి నగర ప్రజలు ఘన స్వాగతం పలికారు. 2018కు బైబై చెప్పి.. 2019కు స్వాగతం చెబుతూ.. సోమవారం అర్ధరాత్రి వరకు డ్యాన్సులు, పాటలతో సరదాగా గడిపారు. నగరంలోని పలు హోటళ్లలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఇందులో యువతీయువకులు పెద్ద ఎత్తున పాల్గొని, వేడుకలు జరుపుకున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాగరతీరంలో యువత సందడి చేశారు. బీచ్‌రోడ్డు మొత్తం జాతరను తలపించింది.   

అల్లిపురం(విశాఖ దక్షిణ): నగరాన్ని ప్రశాంతంగా ఉంచేం దుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తద్వారా విశాఖను సేఫ్‌ జోన్‌గా మార్చాలని అధికారులు, సిబ్బందికి నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డా సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మంగళవారం సూర్యాభాగ్‌ ఏఆర్‌ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు రూపొందించిన హేండ్‌బుక్, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర శాంతిభద్రతలు కాపాడటంలో సిబ్బంది ముఖ్యపాత్ర వహించాలన్నారు. 2019లో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.

పాపాహోంలో..: పోలీస్‌ కమిషనరేట్‌లోని పాపాహోం, సీతమ్మధారలోని బాలికల పాపాహోంలో జరిగిన వేడుకల్లో సీపీ పాల్గొన్నారు. చిన్నారులతో కలసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయనకు కేక్‌ తినిపించేందుకు పోటీ పడ్డారు. నగర డీసీపీ–1 రవీంద్రనాథ్‌బాబు, డీసీపీ–2 అద్మన్‌ నయీమ్‌ అశ్మీ, క్రైం డీసీపీ ఏఆర్‌ దామోదరరావు, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఏఆర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు మంగళవారం అన్ని శాఖల ఉన్నాతాధికారులు కలెక్టరేట్‌కు క్యూ కట్టారు. జాయింట్‌ కలెక్టర్‌ సృజన ఆయనకు  పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఉప రవాణాశాఖాధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో తేజ్, కలెక్టరేట్‌ సిబ్బంది, తదితరులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు