వైభవంగా పైడితల్లి జాతర ప్రారంభం

26 Feb, 2018 12:05 IST|Sakshi
అమ్మవారికి పూజలు చేస్తున్న అర్చకులు

భక్తుల రద్దీతో సందడి వాతావరణం

రాజాం సిటీ/రూరల్‌: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ మేనేజర్‌ కే సర్వేశ్వరరావు తెల్లవారుజామున మొదటి పూజ చేసి యాత్రను ప్రారంభించారు. ఏటా మాదిరిగానే హుండీని ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్టా విశాలగుప్తా కుమారుడు కల్యాణ్‌చక్రవర్తి, టిక్కెట్‌ కౌంటర్‌ను రాజాం మాజీ సర్పంచ్‌ చెలికాని రామారావు భార్య వేదలక్ష్మి ప్రారంభించారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన జాతర సాయంత్రానికి ఊపందుకుంది. ఆలయం నుంచి ప్రధాన రహదారిపై కిలోమీటరు పొడువునా భక్తుల రద్దీ నెలకొంది.

వీరు అధికంగా ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జెయింట్‌వీల్, సర్కస్‌లు, రంగులరాట్నాలు ఆకట్టుకున్నాయి. వీటితోపాటు వివిధ ఆటవస్తువుల షాపులు, గృహోపకరణ అలంకరణ సామగ్రి, తదితర షాపులు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా రాజాం సీఐ ఎన్‌ వేణుగోపాలరావు, పోలీసులు, కమ్యూనిటీ పోలీసులు, భారత్‌ స్క్వౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భద్రత ఏర్పాట్లు నడుమ తొలిరోజు జాతర ప్రశాంతంగా సాగింది.

ఆలయ ఆవరణలో వినోద కార్యక్రమాలు 

ఎల్లమ్మ జాతర పోటెత్తిన భక్తులు
పలాస/మందస: పలాస జామియాత్రకు భక్తులు పోటెత్తారు. కాశీబుగ్గ శ్రీనివాస కూడలి నుంచి పలాస ఇందిరమ్మ విగ్రహం వరకు రద్దీగా మారింది. మందస మండలంలో గోపాలపురం–శ్రీనివాసపురంలో ఎల్లమ్మతల్లి జాతరకు సోంపేట–మందస మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 

కేటీ రోడ్డులో భక్తుల రద్దీ

ఆకట్టుకున్న సైకత శిల్పం
కవిటి: స్థానిక ఎల్లమ్మ ఆలయంలో కవిటికి చెందిన యువకుడు గిరీష్‌ బెహరా జామి ఎల్లమ్మ అమ్మవారి సైకత శిల్పాన్ని వేశాడు. దీన్ని చూసిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగారు.


గిరీష్‌ కుమార్‌ బెహరా వేసిన ఎల్లమ్మ అమ్మవారి సైకత శిల్పం

మరిన్ని వార్తలు