ఘనంగా వాజ్‌పేయి జన్మదిన వేడుకలు

26 Dec, 2013 02:39 IST|Sakshi

 ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని బుధవారం పట్టణంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిమ్స్ ఆస్పత్రిలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జోగు రవి అధ్యక్షతన రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా కార్యకర్తలు రక్తదానం చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్ మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన వాజ్‌పేయి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. దేశాభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే పదవులను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మడావి రాజు, జిల్లా కార్యదర్శి తుల రఘుపతి, నియోజకవర్గ ఇన్‌చార్జి జనగం సంతోశ్, మండల అధ్యక్షుడు వేణుగోపాల్, నాయకులు సురేష్‌జోషి, నరేందర్ డోక్వాల్, ప్రపుల్‌వఝే, సుభాష్ జాదవ్, శ్రీధర్, కృష్ణకుమార్, లక్ష్మణ్‌సింగ్, ఆదినాథ్, విజయ్ పాల్గొన్నారు.
 
 ఇంద్రవెల్లిలో..
 ఇంద్రవెల్లి : వాజ్‌పేయి జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు బుధవారం మండలకేంద్రంలోని రాధాకృష్ణ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆలయ మహరాజ్ రాందాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దీపక్‌సింగ్ షేకావత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు మారప రాజు, దళిత మోర్చా మండల అధ్యక్షుడు అనిల్, పార్టీ ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, విజయ్, పెందోర్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు