బాబుకు మహా గుణపాఠం

16 May, 2015 05:37 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ విజయంతో టీడీపీ పతనం మొదలవ్వాలి
కొత్త నియోజకవర్గం..కొత్త పార్టీ కోసం గంటా అన్వేషణ
ఏడాదిలో భీమిలికి చేసిందేమీ లేదు..
పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి

 
  అందలమెక్కిన తర్వాత ప్రజలను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవీఎంసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, జీవీఎంసీ ఎన్నికల పరిశీలకుడు వి.విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు.  శుక్రవారం చిట్టివలసలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మినీకల్యాణమండపంలో జరిగిన భీమిలి పట్టణ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు వైఫల్యాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో    పార్టీ అధికారప్రతినిధి మాజీమంత్రి తమ్మినేని సీతారామ్ ..మాజీ ఎంఎల్‌ఎ గొల్లబాబూరావు..జల్లా పార్టీ అధ్యక్షుడు అమర్‌నాథ్ తదితరులు ప్రసంగించారు.
 
 తగరపువలస : అబద్దాలు ఆడి అందలమెక్కిన తర్వాత ప్రజలను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవీఎంసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, జీవీఎంసీ ఎన్నికల పరిశీలకుడు వి.విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. జీవీఎంసీలో వైఎస్సార్‌సీపీ పతాకం ఎగురవేయడం ద్వారా టీడీపీ పతానానికి నాందిపలకాలన్నారు. శుక్రవారం చిట్టివలసలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మినీకల్యాణమండపంలో జరిగిన భీమిలి పట్టణ పార్టీ కార్యకర్తల విస్తత స్థాయి సమావేశం జరిగింది.. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయానికి పార్టీలు మారడం.. నియోజకవర్గాలు మారడం మంత్రి గంటా శ్రీనివాసరావుకే చెల్లిందన్నారు.

ఏడాదిగా మంత్రి హోదాలో ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గానికి చేసిందేమి లేదన్నారు. 2019కి ఏ పార్టీలోచేరాలి? ఏ నియోజకవర్గాన్నిఎంచుకోవాలో వెతుక్కునే పనిలో ఉన్న గంటా కావాలనే చిట్టివలస జ్యూట్‌మిల్లు,ఆర్టీసీ కాంప్లెక్స్‌సమస్యలు పరిష్కరించడం లేదన్నారు..మండల కన్వీనర్ల నియామకాన్ని ఈ నెల 25లోగా కమిటీలు పూర్తిచేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిరోజైన జూలై 8నుంచి సభ్యత్వ నమోదులు,సెప్టెంబర్ 2న ప్లీనరీ సమావే శాలు ఏర్పాటు చేయడానికి పార్టీ అధ్యక్షులు సిద్ధంగా ఉన్నారన్నారు.

పార్టీ అధికారప్రతినిధి మాజీమంత్రి తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ అడ్డగోలుగా అబద్దాలు చెప్ప లేకనే వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారని, నిజం మాట్లాడితే తల వెయ్యిముక్కలవుతుందని శాపంతో ఉన్న చంద్రబాబు అబద్దాలతోనే గద్దెనెక్కి ఆ అబద్దాలతోనే పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. మతగ్రంధాల కన్నా ఎన్నికల మేనిఫెస్టో పవిత్రమైందని, దాంట్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని టీడీపీని విజ్ఞతకలిగిన ఓటరు 2019లో ఇంటికి పంపడం ఖాయమన్నారు.

జీవీఎంసీ ఎన్నికల పీఠం చేజిక్కించుకోవడానికి టీడీపీ అధికారం, డబ్బు, మద్యం, పోలీసులతో సర్వశక్తులు ఒడ్డుతుందన్నారు.దీనిని తిప్పికొట్టడానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సన్నద్దం కావాలన్నారు. రాష్ట్రప్రధానకార్యదర్శి గొల్ల బాబూరావు మాట్లాడుతూ పార్టీ భవిష్యత్తు జీవీఎంసీ ఎన్నికలపై ఆధారపడి ఉందన్నారు. జీవీఎంసీపై వైఎస్సార్‌సీపీ పతాకం ఎగిరితే టీడీపీ కుంగిపోతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది పాలనలోని వైఫల్యాలపై జూన్ మొదటి వారంలో వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రజలమద్య నిరసనదీక్ష చేపట్టనున్నారని చెప్పారు.

రైతుల ఆత్మహత్యలపై ఇప్పటికే రైతు భరోసాయాత్ర చేస్తున్నారన్నారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారామ్ మాట్లాడుతూ జ్యూట్‌మిల్లు మూతపడితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో వెంటనే తెరిపించామని గుర్తు చేశారు పట్టణ కన్వీనర్ అక్కరమాని వెంకటరావు మాట్లాడుతూ 155 ఏళ్ల భీమిలి మున్సిపాల్టీని జీవీఎంసీలో విలీనం చేయడానికి మంత్రి గంటా,ఎంపీ ముత్తంశెట్టిలు తహతహలాడు తున్నారన్నారు.

సమావేశంలో పార్టీ సీఈసీ సభ్యులు కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, రాష్ట్ర ప్రచారకమిటీ కార్యదర్శి రవిరెడ్డి,పక్కి దివాకర్,సీనియర్ నాయకులు దాట్ల వెంకట అప్పల ప్రసాద రాజు,చందక బంగారునాయుడు,మూడు మండలాల పార్టీ అద్యక్షులు వెంపాడ శ్రీనివాస రెడ్డి, బంక సత్యం,కంటుబోతు రాంబాబు,ఆనందపురం ఎంపీపీ చెన్నా వరలక్ష్మి, ఉపాద్యక్షుడు మీసాల సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు