పూర్తిస్థాయిలో మొదలైన గ్రీవెన్స్‌సెల్

3 Jun, 2014 01:12 IST|Sakshi

కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్:  దాదాపు మూడు నెలల తర్వాత ప్రజాదర్బార్ పూర్తిస్థాయిలో జరగడంతో వినతులు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు, జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. హౌసింగ్ పీడీ రామసుబ్బు, డీఆర్‌డీఏ పీడీ నజీర్‌సాహెబ్, జేడీఏ ఠాగూర్‌నాయక్‌లు తమ శాఖలకు సంబంధించిన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొద్దిసేపు సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఇకపై ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజాదర్బార్, డయల్ యువర్ కలెక్టర్‌కు వచ్చిన సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని వివరించారు.
 
 ఇంటి పట్టాలు ఇవ్వండి:
 గోస్పాడు మండలం బీవీనగర్‌లో కొన్నేళ్ల క్రితం చింతమానువనంలో ఇళ్లు, గుడిసెలు నిర్మించుకుని 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.   వారికి పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌కు ప్రజాదర్బార్‌లో వినతిపత్రం సమర్పించాను.  - శ్రీనివాసరెడ్డి

మరిన్ని వార్తలు