ఇద్దరూ ఇద్దరే

22 Feb, 2018 12:57 IST|Sakshi
భవానీశంకర్‌కు మిఠాయి తినిపిస్తున్న తండ్రి అప్పలనాయుడు

గ్రూప్‌–1లో మెరిసిన పార్వతీపురం వాసులు

హేమలతకు రెండో ర్యాంకు

భవానీశంకర్‌కు మూడో ర్యాంకు

కృషితో నాస్తి దుర్భిక్షం.. అన్న పదానికి సిసలైన నిదర్శనంగా నిలిచారు. రేయింబవళ్లు యజ్ఞంలా శ్రమించారు. అదే వారిద్దరినీ గ్రూప్‌ వన్‌ విజేతల్ని చేసింది. అత్యుత్తమ ర్యాంకుల్ని కట్టబెట్టింది. ప్రతిష్టాత్మకమైన గ్రూప్‌–1 పరీక్ష ఫలితాల్లో పార్వతీపురానికి చెందిన ఇద్దరికి వరుసగా 2, 3 ర్యాంకులు లభించడం విశేషం. పంచాయతీరాజ్‌ శాఖలో డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారి కె.హేమలతకు రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, పార్వతీపురం వివేక్‌  కాలనీకి చెందిన భవానీశంకర్‌కు రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు లభించాయి.

పార్వతీపురం: శ్రీకాకుళం జిల్లా కనుగులవాని పేట గ్రామం వ్యవసాయ కుటుంబానికి చెందిన హేమలత తండ్రి రైతు. పిల్లలకు ఉన్నత విద్య చదివించి వారిని ప్రయోజకులను చేయాలని పరితపించేవారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగానే పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. హేమలత అక్క హైమావతి ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. సోదరుడు జగదీశ్వరరావు తెలంగాణా నీటిపారుదల శాఖలో ఏఈఈగా పనిచేస్తున్నారు. హేమలత భర్త నర్సీపట్నంలో అటవీ శాఖాధికారిగా పనిచేస్తున్నారు.

2007లో సివిల్స్‌లో 13 మార్కులతో, 2010లో 1 మార్కుతో ఇంటర్వ్యూ వరకు వచ్చి అవకాశం చేజార్చుకున్నారు. 2016లో గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షను రాసి తాజాగా రాష్ట్ర స్థాయిలో రెండోస్థానంలో నిలి చారు. మహిళా విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచారు.

రోజూ 13 గంటలు చదివా
రోజుకు 13 గంటల పాటు చదివాను. రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకును సాధించుకున్నందుకు ఆనందంగా ఉంది. తొలి ప్రయత్నం తోనే 460.5 మార్కులు సాధించాను. ప్రజలకు ఏదైనా చేయడానికి నాకు ఒక అవకాశం లభించిందన్న సంతోషం ఎక్కువగా కలుగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. – భవానీశంకర్, పార్వతీపురం

తండ్రి స్ఫూర్తితో
మూడో ర్యాంకు సాధించిన భవానీ శంకర్‌ స్వస్థలం గరుగుబిల్లి మండలం గిజబ గ్రామం. ప్రస్తుతం పార్వతీపురంలో నివసిస్తున్నారు. ఆయన తండ్రి అప్పలనాయుడు డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసేవారు. కార్యాలయంలో, ఇంటా బయటా తండ్రికి లభించే గౌరవం, ప్రజా సమస్యలపై ఎప్పుడు చర్చించడం గమనించేవాడు. ఏదైనా పనిచేసి పెడితే ప్రజలు చూపించే అభిమానంతో స్ఫూర్తి పొందాడు. తండ్రి అప్పలనాయుడు, తల్లి రూపాదేవి ప్రోత్సాహం లక్ష్యానికి తోడైంది. భవానీ శంకర్‌ 10వ తరగతి వరకు పార్వతీపురంలోనే చదివారు. ఎంసీఏ చేసినప్పటికీ గ్రూప్స్‌పై ఇష్టంతో కష్టపడి చదివి విజయం సాధించారు.

మరిన్ని వార్తలు