సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ రోజు రోజుకూ పెరుగుతోంది. పార్టీలో వర్గ విభేదాలు సమసిపోయేలా చేయాలని సీఎం ఎంత ప్రయత్నించినా సెగ రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఏం చేయాలో పాలుపోక సీఎం తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పశ్చిమ ప్రకాశంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఫార్ములాను అమలు చేయాలనుకున్న సీఎంకు ఇక్కట్లు తప్పడం లేదు. యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు సీఎంకు మరింత తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇక అద్దంకిలో తాజా రాజకీయ పరిణామాలు ప్రధానంగా కరణం బలరాం దూకుడుగా వ్యవహరిస్తుండడం సీఎంను మరింత ఇరుకును పెడుతోంది. పది రోజులుగా ఎమ్మెల్సీ కరణం బలరాం అద్దంకి రాజకీయాల్లో దూకుడు పెంచారు. నియోజకవర్గంలోని సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి, జే పంగులూరు మండలాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో జరిగిన సిమెంటు రోడ్లకు వరుస పెట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అద్దంకి నుంచి రాబోయే ఎన్నికల్లో తామే పోటీలో ఉంటామంటూ కరణం, ఆయన తనయుడు వెంకటేష్లు ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో పాటు బలరాం తనదైన శైలిలో తాను పార్టీ మారినప్పుడు పదవికి రాజీనామా చేసి వచ్చానని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పదవికి రాజీనామా చేయకుండా పార్టీలు మారడం సరైన సంస్కృతి కాదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్పై పరోక్ష విమర్శలకు దిగుతున్నారు. కరణం, ఆయన తనయుడు వెంకటేష్ల దూకుడుతో సంతమాగలూరు, బల్లికురవ, అద్దంకి, జే పంగులూరు మండలాల్లో వారి అనుచరవర్గం తిరిగి బలరాం చెంతకు చేరుతోంది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరిన తర్వాత నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు ఆయనకే అప్పగించినట్లు సీఎం ప్రకటించారు. కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి అద్దంకి రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ పరిణామంతో బలరాం వర్గంలో చాలా మటుకు ఎమ్మెల్యే గొట్టిపాటి వైపు వెళ్లింది. ఆ తర్వాత బలరాం కుటుంబం కొద్ది రోజులు అద్దంకి రాజకీయాలకు దూరంగానే ఉంది.
ఇప్పుడు ఒక్కసారిగా బలరాం కుటుంబం అద్దంకి రాజకీయాల్లో జోక్యం పెంచి ఏకంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు దిగడం జిల్లా అధికార పార్టీతో పాటు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలరాం స్పీడు పెంచినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించేందుకు బలరాం సిద్ధమయ్యారు. తాము అద్దంకి నుంచి బరిలో దిగుతామని ఇప్పటికే వారు క్యాడర్కు సంకేతాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే పాత వర్గాన్ని మొత్తం తిరిగి తమవైపు తెచ్చుకునేందుకు దూకుడు పెంచినట్లు తెలు స్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అద్దంకి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గొట్టిపాటి ఉంటారా..? లేక లేక కరణం వెంకటేష్ ఉంటారా..? అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. అధికార పార్టీ క్యాడర్లోనూ ఇదే అనుమానం నెలకొంది. బలరాం దూకుడుతో పాత వర్గాలు తిరిగి ఆయన చెంత చేరుతోంది. అద్దంకిలో బలరాం తిరిగి జోక్యాన్ని పెంచడంపై గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ల దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే బలరాం విషయంలో తెగేదాక లాగడం సరికాదని ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదే అదునుగా బలరాం కుటుంబం సైతం అమీ తుమీకి సిద్ధపడే పరిస్థితి కనిపిస్తోంది. అభ్యర్థి గొట్టిపాటా... లేక తామా ... అన్నది తేల్చుకునేందుకు వారు వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ఎవరో ఒకరు పార్టీని వీడతారన్న ప్రచారమూ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎటువైపు మొగ్గుతారన్నది వేచి చూడాల్సిందే.