జీశాట్-18 ఉపగ్రహ కక్ష్య దూరం పెంపు..

8 Oct, 2016 03:46 IST|Sakshi
జీశాట్-18 ఉపగ్రహ కక్ష్య దూరం పెంపు..

శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం ఏరియన్-5 వీఏ231 రాకెట్ ద్వారా ప్రయోగించిన 3,404 కిలోలు బరువు కలిగిన జీశాట్ -18 ఉపగ్రహానికి శుక్రవారం వేకువజామున 3.46 గంటలకు కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. ఈ సమాచార ఉపగ్రహాన్ని 251.7 కిలోమీటర్ల, పెరిజీ(భూమికి దగ్గరగా), అపోజి(భూమికి దూరంగా) 35,888 కిలోమీటర్లు ఎత్తులోని భూ బదిలీ కక్ష్య(జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్)లో దిగ్విజయంగా ప్రవేశపెట్టిన విషయం విదితమే.

కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాన్ని బెంగళూరు సమీపంలోని హాసన్ ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం(ఎంసీఎఫ్) వారు అధీనంలోకి తీసుకుని ఉపగ్రహంలో నింపిన 2004 కిలోల ఇంధనంలో కొంతభాగాన్ని శుక్రవారం వేకువజామున 6,040 సెకెండ్లపాటు మండించి కక్ష్య దూరాన్ని పెంచారు. ప్రస్తుతం 251.7 కిలోమీటర్ల దూరంలోని పెరీజీని 14,843 కిలోమీటర్లుకు పెంచుతూ... అపోజీని మాత్రం 35,888 కిలోమీటర్ల నుంచి 35,802 కిలోమీటర్లకు తగ్గించారు. మరో రెండు దశల్లో ఇంధనాన్ని మండించి పెరీజీని పెంచుకుంటూ జియో ట్రాన్స్‌ఫర్ కక్ష్య నుంచి దశల వారీగా భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్య (జియో సింక్రనస్ ఆర్బిట్)లోకి సమస్థితిలో స్థిరపరచే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు.

>
మరిన్ని వార్తలు