కరోనా వైరస్‌: వారిపైనే ఫోకస్‌

31 Mar, 2020 09:54 IST|Sakshi
గుంటూరు నగరంలోని హిందూ కళాశాల సెంటర్‌లో రాకపోకలు నిలిపివేసిన దృశ్యం

ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో  పాజిటివ్‌ కేసులు

ఒకేరోజు ఐసోలేషన్‌కి  80 మంది తరలింపు

మిగిలినవారి వివరాల సేకరణలో అధికారులు 

ఢిల్లీకి మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తులపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. సుమారు 70 మంది జిల్లా నుంచి వెళ్లినట్లు గుర్తించారు. ఈ నెల 19న వీరంతా జిల్లాకు చేరుకున్నారు. అప్పటి నుంచి వీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు. వారితో సన్నిహితంగా 134 మంది ఉన్నట్లు తెలిసింది. వారిలో 90 మందిని గుర్తించి సోమవారం ఒక్కరోజే 80 మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. 

సాక్షి, అమరావతి: మత ప్రార్థనలకు వెళ్లిన వచ్చి క్వారంటైన్‌కు తరలించిన వారి శాంపిళ్లు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపుతున్నారు. సోమవారం ఒక్కరోజే 80 మందిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించి శాంపిళ్లు సేకరించారు. మిగిలిన వారి కోసం వేట  కొనసాగిస్తున్నారు. గుంటూరు, మాచర్ల  ప్రాంతాల్లో కరోనా బాధిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో వైద్య సేవలు అందిస్తున్నారు. క్వారంటైన్‌ సెంటర్‌లలో వసతుల కల్పన బాధ్యతలను డీఆర్‌డీఏ పీడీ యుగంధర్‌కు అప్పగించారు. కరోనా అనుమానిత బాధితులను క్వారంటైన్‌ సెంటర్‌లు, ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించే బాధ్యతను డ్వామా పీడీ గజ్జల శ్రీనివాసరెడ్డి  పర్యవేక్షిస్తున్నారు.

 ఓ వైపు కరోనా అనుమానితులను గుర్తిస్తూ... మరోవైపు విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు, ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. వారిలో కొంత మందిని హోం క్వారంటైన్‌తోపాటు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లు, ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు. కరోనా కోరల్లో జిల్లా ప్రజలు చిక్కుకోకూడదనే ధృఢసంకల్పంతో అధికారులు రేయింబవళ్లు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనందకుమార్, జాయింట్‌ కలెక్టర్‌ దినే‹Ùకుమార్, తదితర అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ దిశ, నిర్దేశం చేస్తున్నారు.

ప్రస్తుతం జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో  పాల్గొంటున్న 16 ప్రత్యేక బృందాలను బలోపేతం చేసే  దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్‌ సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, తమ పరిధిలో ఉన్న ఉద్యోగుల వివరాలు  అందించాలని ఆదేశించారు. విద్యా శాఖతోపాటు, పలు శాఖల ఉద్యోగులను కరోనా విధులకు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. 

జిల్లాలో 13,593 బెడ్‌ల గుర్తింపు
ప్రైవేటు ఆసుపత్రులను సైతం ఆ«దీనంలోకి తీసుకుని ఆయా ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కలి్పంచి కరోనా బాధితులకు వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో జిల్లాలోని 85 ఆరోగ్యశ్రీ ఆసుపత్రులను గుర్తించి అందులో 7,312 బెడ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండో దశలో ఆరోగ్యశ్రీలేని ప్రైవేటు ఆసుపత్రులు 97 ఆసుపత్రుల్లో 6,221 బెడ్‌లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో 13,593 బెడ్‌లను ఏర్పాటు చేసే దిశగా ఫీల్డ్‌ సర్వేలెన్స్‌ టీమ్‌ పర్యవేక్షిస్తున్న డెప్యూటీ కలెక్టర్‌ కొండయ్య ఆధ్వర్యలో ప్రణాళికలు రచిస్తున్నారు.

మెరుగైన వసతులు కల్పిస్తాం 
ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూలీ  పనుల కోసం వచ్చిన  వలస కూలీలకు మెరుగైన వసతులతోపాటు, భోజన సౌకర్యాలు  ఏర్పాటు చేస్తున్నాం. వలస వచ్చిన వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుంటూరులోని మంగళదాస్‌నగర్‌లో ఇప్పటికి పూర్తి లాక్‌ డౌన్‌  ఏర్పాటు చేశాం. మాచర్లలోని  కంటోన్మెంట్‌ ప్రాంతంలో పూర్తి స్థాయిలో లాక్‌ డౌన్‌ అమలు చేయాలని అధికారులను ఆదేశించాం. –ఐ.శామ్యూల్‌ ఆనందకుమార్, కలెక్టర్‌

మరిన్ని వార్తలు