మూఢాచారాలపై తిరగబడ్డ ‘గుర్రం’

28 Sep, 2019 11:14 IST|Sakshi
విజేతలకు బహుమతులు ఇస్తున్న ప్రతినిధులు

సాక్షి, ఒంగోలు టౌన్‌: సమాజంలోని మూఢాచారాలపై కవిత్వమనే ఆయుధంతో తిరగబడ్డ మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అని స్థానిక శ్రీ పింగళి కోదండరామయ్య సంస్కృతాంధ్ర విద్యానిలయం ఓరియంటల్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్‌. పద్మావతి కొనియాడారు. జాషువా 125వ జయంతి వేడుకలను శుక్రవారం పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుర్రం జాషువా చిన్నతనం నుండే మక్కువ కలిగి మహాకవిగా ఎదిగారన్నారు. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలు బి. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తుచరిత్ర వంటి ఎన్నో గొప్ప పుస్తకాలను గుర్రం జాషువా రచించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పర్యావరణంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో తమ పాఠశాల నుంచి బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను అభినంధించారు. ఉపాధ్యాయులు ఎన్‌. శ్రీకాంత్, జి. ఆనంద్, కె. సత్యనారాయణ, ఉమాదేవి పాల్గొన్నారు.

ఘనంగా జాషువా పద్యాల పోటీ
మహాకవి గుర్రం జాషువా జయంతి పురస్కరించుకుని బహుజన రచయితల వేదిక ఆధ్వర్యంలో ఒంగోలు ట్రినిటీ హైస్కూలులో చిన్నారులకు జాషువా పద్యాల పోటీ ఘనంగా నిర్వహించారు. పోటీ సందర్భంగా నిర్వహించిన సభకు వేదిక కార్యదర్శి డాక్టర్‌ నూకతోటి రవికుమార్‌ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ట్రినిటీ సురేష్‌  ప్రసంగించారు. విద్యార్థుల్లో పద్య సాహిత్యంపై ఆసక్తి పెంచటానికి ఇటువంటి సృజనాత్మక పోటీలు ఉపకరిస్తాయన్నారు. సభలో వేదిక గౌరవ సలహాదారు మిరియం అంజిబాబు, అకాడెమీ ఆఫ్‌ రొబోటిక్స్‌ ప్రతినిధి జి.ఎస్‌.రవికుమార్‌ పాల్గొని ప్రసంగించగా, న్యాయ నిర్ణేతగా మిట్నసల శాంతారావు వ్యవహరించి జాషువా రచించిన పలు పద్యాలు ఆలపించారు. పోటీల్లో ఒంగోలు క్విస్, నెక్టŠస్‌జెన్, ట్రినిటీ, ఓక్‌బ్రిడ్జ్‌ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు 200 మందికి పైగా పాల్గొనగా, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

మరిన్ని వార్తలు