ఘనంగా గురు పూర్ణిమ పూజలు

31 Jul, 2015 16:54 IST|Sakshi
ఘనంగా గురు పూర్ణిమ పూజలు

కర్నూలు (బేతంచెర్ల) : కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణానికి సమీపాన కర్నూల్ రహదారిలో వెలసిన షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఐదున్నర గంటలకు ఓంకార ప్రణవం, బాబాకు కాకడ హారతి, సుప్రభాత సేవ, ఆరున్నర గంటలకు బాబాకు అభిషేకం, విష్ణుసహస్రపారాయణము, అష్టోత్తర శతనామావళి, మహామంగళహారతి, ఎనిమిదిన్నర గంటలకు బాబా వారికి రూ.5 నాణెములతో తులభార కార్యక్రమము, 9 గంటలకు సత్యసాయి వ్రతము నిర్వహించారు.

పట్టణంలోని ఆయా కాలనీల భక్తులే కాకుండా సిమెంట్‌ నగర్, బుగ్గానిపల్లె, కొలుములపల్లె, ఆర్‌ఎస్ రంగాపురం గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో మహిళలు, భక్తాదులు హాజరు కావడంతో ఆలయం సాయినామస్మరణతో మారు మ్రోగింది. బాబా సందర్శనకు వచ్చిన సుమారు 5వేల మంది భక్తులకు మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటుచేశారు.
 

మరిన్ని వార్తలు