డ్రైనేజీ సంపులో పడ్డ విద్యార్థినులు

6 Aug, 2019 16:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: డ్రైనేజీ సంపు పైనున్న మూత విరిగిపోవడంతో దానిపై ఉన్న ముగ్గురు విద్యార్థినులు డ్రైనేజీలో పడిపోయిన సంఘటన జిల్లాలోని గోపాలపురం బాలయోగి గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. మ్యాట్రిస్‌ రాణి ఆదేశాల మేరకు విద్యార్థినులు పాఠశాల ఆవరణలో మొక్కలు శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంపు సుమారు ఆరు అడుగుల లోతు ఉండడంతో విద్యార్థినులు అందులో మునిగిపోయారు. దీంతో పక్కనే ఉన్న తోటి విద్యార్థినులు సెక్యూరిటీ గార్డు సహాయంతో వారిని బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. పిల్లలతో పనులు చేయించడమేంటని వార్డెన్‌ను నిలదీశారు. పోలీసులు రంగప్రవేశం చేసి తల్లిదండ్రులకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం విద్యార్థినిలను ప్రథమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు