విశాఖపట్నం : ‘నాకు ఏడాదిన్నర సమయంలో టీకాలు వేశారు. కొన్ని రోజుల తర్వాత నాకు పోలియో సోకింది. కాళ్ళు, చేతులు వంకర తిరిగిపోయాయి. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆరో తరగతి మధ్యలోనే ఆపేశాను. ప్రస్తుతం చక్రాల కుర్చీకే పరిమితమయ్యాను. ఒకరి సాయం లేనిదే బయటకు వెళ్లడం సాధ్యం కాదు. ఏడాది క్రితం మా నాన్న అనారోగ్యంతో మృతి చెందారు. నా తల్లి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. కిరాణా బడ్డీ పెట్టుకొని బతుకీడుస్తున్నాం.’ అని ఆనందపురం మండలం కోలావాని పాలెం గ్రామానికి చెందిన ఎస్కే ఫాతిమా జగన్కు తెలిపింది. 2007లో దివంగత సీఎం వైఎస్సార్ హయంలోనే పక్కా ఇల్లు మంజూరైందని, ఇప్పుడు ఆ ఇంట్లోనే నివసిస్తున్నామని చెప్పింది. మా తల్లికి వితంతు పింఛన్ మంజూరు చేయాలని ఈ ప్రభుత్వ హయాంలో చాలాసార్లు దరఖాస్తు చేశామని, అయినా పింఛన్ మంజూరు కాలేదని తెలిపింది. జగన్ అధికారంలోకి వస్తే తమకు న్యాయం చేయాలని అభ్యర్థించింది.