ఆదరణ కరువై..బతుకు భారమై..

17 Mar, 2015 02:57 IST|Sakshi

 విజయనగరం కంటోన్మెంట్:అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేయగలిగే సత్తా ఉన్న నేత కార్మికుడు నేడు  ఆదరణ కరువైన కకావికలమవుతున్నాడు. మహాత్ముని తరువాత చాచాజీ తదితర మహోన్నతులు ధరించిన చేనేత వస్త్రాలను ప్రస్తుత రాజకీయ నాయకులు కూడా వినియోగిస్తున్నప్పటికీ సామాన్య మానవుల నుంచి ఇతరులు కూడా వినియోగించడం మానేశారు. మరో వైపు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వారికి ఎటువంటి సహాయ సహకారాలను అందించకపోవడంతో చేనేతనే నమ్ముకున్న వారు నేడు పట్టెడన్నం లేక అలమటిస్తున్నారు. దీంతో కులవృత్తి కూడు పెట్టడం లేదని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కడుపు నింపుకుంటున్నారు. చేనేత తప్ప మరే వృత్తీ చేతకాకపోయినప్పటికీ కడుపు మంటకు వలస వెళ్లిన ప్రాంతాల్లో ఇతర వృత్తులను నేర్చుకుని మరీ భార్యాబిడ్డలను పోషించుకునేందుకు పాట్లు పడుతున్నాడు. జిల్లాలో 18 కోఆపరేటివ్ సంఘాలున్నాయి. చేనేతకు అనుబంధంగా మరో సంఘముంది. వీటిలో 2960 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న చేనేత కార్మికుల సంఖ్యకు చాలా తేడా ఉంది. అధికారుల లెక్కల్లో ఉన్న చేనేత కార్మికులు క్షేత్ర స్థాయిలో ఉండడం లేదు. చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన పథకాలు. అవి జిల్లాలో అమలవుతున్న తీరును ఒకసారి పరిశీలిస్తే..
 
 అక్కరకు రాని ఇంటిగ్రేటెడ్ హ్యాండ్‌లూమ్ డెవలప్‌మెంట్ స్కీం
 జిల్లాలో రూ.48.84లక్షలతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా చేనేత కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వారికి అవ సరమైన లూమ్స్ కొనుగోలు చేసి ఇవ్వడం దీని ప్రధానోద్దేశం. కానీ ఈ పథకం ద్వారా ఇచ్చిన శిక్షణ ఎవరికీ  ఉపయోగపడలేదు. అప్పటికే చేనేత రంగంలో విశేష అనుభవం ఉన్న కార్మికులకు ఇంకా శిక్షణలెందుకో అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ పథకానికి కేటాయించిన నిధుల నుంచి రూ.38.66లక్షలు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో ఏ ఏ పనులు చేశారో ఎన్ని శిక్షణా కార్యక్రమాలు చేశారో అధికారులే స్పష్టం చేయాలి.  
 
 గ్రూపులకు నిధుల కేటాయింపులున్నా  విడుదలలో నిర్లక్ష్యం  
 జిల్లాలోని చేనేత సంఘాలకు గ్రూపుల వారీగా అభివృద్ధి నిధులను విడుదల చేస్తున్నారు. ఇలా 2007-08లో రూ5.40 లక్షలకు గాను రూ.3.79లక్షలు విడుదలయింది. అదేవిధంగా 2008-09లో రూ.లక్షా42వేలు విడుదలయింది. 2010 -11లో 40 మంది సభ్యులు కలిగిన రెం డు సంఘాల అభివృద్ధికి రూ.10.10లక్ష లు మంజూరైంది. కానీ ఇందులో రూ. 5. 74లక్షల నిధులు విడుదలయ్యాయి. అ యితే ఇంతవరకూ ఈ నిధులను గ్రూ పులకు విడుదల చేయలేదు. దీంతో  చేనే త రంగంలో మరేం అభివృద్ధి చెందుతామని ఆయా గ్రూపులు ప్రశ్నిస్తున్నాయి.
 
 ఆదుకోని మహాత్మాగాంధీ
 బునకర్ బీమా!
 చేనేత కార్మికుల కుటుంబాల్లోని యజ మాని ఆత్మహత్యకు పాల్పడితే వారి కు టుంబాలు వీధిన పడకుండా ఉం డేం దుకు ప్రభుత్వం మహాత్మా గాంధీ బునకర్ బీమా యోజన అన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కుల వృత్తి చేస్తున్న  చేనేత కార్మికులు ఏటా రూ.80 ప్రీమియం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం రూ.150 చెల్లిస్తుంది. మరో పక్క ఎల్‌ఐసీద్వారా రూ.100 చెల్లించే ఏర్పాటు చేసినప్పటికీ ఈ పథకం వల్ల ఎవరికీ చెప్పుకోదగ్గ ప్రయోజనం కలగడం లేదని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ పథకం ప్రకారం మృతి చెందిన కుటుంబాలకు రూ.60వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీని వల్ల  బీమా మొత్తం చాలక ఆయా కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి.
 
 కానరాని స్కాలర్ షిప్పులు
 జిల్లాలో 2010లో చేనేత కార్మికుల పిల్లల చదువుల కోసం స్కాలర్ షిప్పుల పథకాన్ని ప్రవేశపెట్టగా రెండేళ్లు వరుసగా రూ.ఏడులక్షల నిధులను విడుదల చేసి  ఒక్కో విద్యార్థికీ రూ.1200 చొప్పున చెల్లించిన ప్రభుత్వం గత రెండేళ్లుగా ఒక్క విద్యార్ధికీ స్కాలర్ షిప్పులు చెల్లించలేదు.
 
 మూతపడ్డ హెల్త్ కేర్ స్కీం!
 జిల్లాలో చేనేత కార్మికులకోసం రూపొందించిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని ఎత్తివేశారు. ఒక కుటుంబంలో భార్యా, భర్త ఇద్దరు పిల్లలకోసం చేపట్టిన ఈ పథకంలో ఆ కుటుంబం వంద రూపాయలు చెల్లిస్తే రూ.15వేల బిల్లుల చెల్లింపునకు అవకాశముండేది. దీనిని గతంలో కొన్ని సంఘాలు వినియోగించుకున్నాయి. కానీ ఇప్పుడా పథకం అమలు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
 క్రెడిట్‌కార్డులేవీ?
 చేనేత కార్మికులకు క్రెడిట్‌కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికీ క్రెడిట్ కార్డులకు మోక్షం కల్పించలేదు. జిల్లాలో 50 మందికి లక్ష్యం విధించుకున్న ప్రభుత్వం కేవలం 9 మందికి మాత్రమే కార్డులిచ్చి చేతులు దులుపుకుంది. ఇలా అయితే ఎలా బాగుపడతామని ఆయా కార్మికుల కుటుంబా లు వాపోతున్నాయి.
 

మరిన్ని వార్తలు