ఉపాధ్యాయురాలికి లైంగిక వేధింపులు

27 Feb, 2020 13:26 IST|Sakshi
చింతలపూడి ప్రభుత్వ హైస్కూల్‌లో విచారణ జరుపుతున్న అధికారులు

సహ ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు

విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు

పశ్చిమగోదావరి, చింతలపూడి: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు తన తోటి ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రభుత్వ హైస్కూల్‌లో వెలుగు చూసింది. ఉన్నతాధికారులకు సదరు ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేయడంతో జిల్లా విద్యాశాఖాధికారిణి సీవీ రేణుక విచారణకు ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖకు చెందిన ఆర్‌ఎంఎస్‌ ఏఓ ఎస్‌.సూర్యకుమారి, సీనియర్‌ అసిస్టెంట్‌లు కె.రాజకుమారి, కె.పావనీల ముగ్గురు సభ్యుల బృందం బుధవారం హైస్కూల్‌కు చేరుకుని ఉపాధ్యాయురాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపారు.

వివరాలు ఇలా ఉన్నాయి.. చింతలపూడి ప్రభుత్వ హైస్కూల్‌లో గత 5 ఏళ్లుగా వెంకటరత్నం అనే ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో పనిచేస్తున్న సహ ఉపాధ్యాయురాలిని గత కొద్ది నెలలుగా లైంగికంగా వేధిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారికి, జిల్లా కలెక్టర్‌కు ఆ ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి జరిగిన సంఘటనపై వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఏఓ సూర్యకుమారి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించామని నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి అందజేస్తామని  తెలిపారు.

>
మరిన్ని వార్తలు