మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు

10 May, 2019 12:34 IST|Sakshi
పాలకొల్లు పురపాలక సంఘ కార్యాలయం

పాలకొల్లు మున్సిపాలిటీ ఉన్నతాధికారి లీలలు

పశ్చిమగోదావరి, పాలకొల్లు సెంట్రల్‌: పాలకొల్లు పురపాలక సంఘం ఏర్పడి దాదాపు వందేళ్లు పూర్తవుతోంది. ఎన్నడూ లేనివిధంగా గత ఐదేళ్లలో పురపాలక సంఘం ప్రతిష్ట దిగజారింది. అధికారుల అవినీతి, అక్రమాలు, లైంగిక వేధింపులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి సంఘటనలు మున్సిపాలిటీ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. ఐదేళ్లలో రెండుసార్లు ఏసీబీ దాడులు జరగడం ముగ్గురు అధికారులు సస్పెండ్‌ కావడం విస్మయానికి గురిచేశాయి.

ఆందోళనలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినులు
పాలకొల్లు పురపాలక సంఘ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి నుంచి ఔట్‌ సోర్సింగ్‌ మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. మునిసిపల్‌ కార్యాలయంలో కమిషనర్, మేనేజర్‌ కార్యాలయాలతో పాటు ఇంజినీరింగ్‌ విభాగం, పట్టణ ప్రణాళికా విభాగం, రెవెన్యూ విభాగం, ఆరోగ్య విభాగం, అకౌంట్‌ సెక్షన్, మెప్మా ఇలా పలు విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిలో కొందరు మహిళలు, యువతులు ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆరు నెలల క్రితం మున్సిపాలిటీకి వచ్చిన ఓ సెక్షన్‌ అధికారి నుంచి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగినులు వేధింపులు ఎదుర్కొంటున్నారు. 

అడ్డదిడ్డమైన ప్రశ్నలతో..
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినులు చేసే పనిలో అడ్డంకులు సృష్టించడంతో పాటు, జీతం బిల్లులు పెండింగ్‌లో పెట్టి సదరు సెక్షన్‌ అధికారి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వేధింపులు భరించలేని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగినులు తమకు రక్షణ లేదా అంటూ కార్యాలయంలో పర్మినెంట్‌ ఉద్యోగుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. కార్యాలయంలో ఉన్న ఈ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగినులే కాకుండా పట్టణంలో డ్వాక్రాకు సంబంధించిన ఓ మహిళ సెల్‌ నంబర్‌ తీసుకుని ఆమెకు ఫోన్‌ చేసి సదరు సెక్షన్‌ అధికారి వేధించడం గమనార్హం. వీరితో పాటు వేధింపులు బయటకు చెప్పుకోలేని మహిళా ఉద్యోగినులు, మహిళలు ఇంకెంతమంది ఉన్నారో అని కార్యాలయ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్‌ అధికారి తమ జీతాల బిల్లులు చేయడం లేదని, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడంటూ కొందరు సిబ్బంది మునిసిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లగా ఏపని ఉన్నా నేరుగా తనవద్దకు రావచ్చని కార్యాలయ ఉద్యోగులకు కమిషనర్‌ భరోసా కల్పించినట్టు తెలిసింది. 

పర్మినెంట్‌ ఉద్యోగులకూ తప్పని ఇక్కట్లు
మునిసిపల్‌ పర్మినెంట్‌ ఉద్యోగులకూ ఆ అధికారి నుంచి ఇక్కట్లు తప్పడం లేదు. పొరుగూరు నుంచి వచ్చే కొందరు ఉద్యోగులు ఉదయం 9.30 గంటలకు కార్యాలయానికి చేరుకుంటున్నారు. వచ్చిన వెంటనే బయోమెట్రిక్‌లో వేలిముద్రలు వేసి రిజిస్టర్‌లో సంతకం చేసి వారి పనుల్లో నిమగ్నమవుతారు.
అయితే ఆ ఉన్నతాధికారి 10.30 గంటలకు రిజిస్టర్‌ పెడతాను.. పది నిమిషాలే ఉంచుతాను.. మీరు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలి లేదంటే ఆలస్యంగా వచ్చినట్లు రిపోర్టు రాస్తానని బెదిరిస్తున్నాడని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఇంజనీర్‌ అయినా, టీపీఓ అయినా సరే ఎవరైనా తన వద్దకు వచ్చి సంతకం చేయాల్సిందే అంటూ హుకుం జారీ చేశారంట. అతడి విధానంపై అధికారులు, సిబ్బంది వ్యతిరేకించడంతో రెండు రోజుల నుంచి రిజిస్టర్‌ను వారికి అందుబాటులో ఉంచినట్టు సమాచారం.

ఏసీబీ దాడులు జరిగినా..
ఇప్పటికే మునిసిపాలిటీలో రెండుసార్లు ఏసీబీ దాడులు జరిగినా సదరు ఉన్నతాధికారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ మునిసిపల్‌ కార్యాలయంలో ఫైల్‌ కదలాలంటే పైసలు కూడా కదిలి రావాల్సిందే. పైసలు ఇవ్వకుంటే సదరు అధికారి సంతకం చేయకుండా ఇబ్బందులు పెడుతుంటారు. లాబీయింగ్‌ కోసం ఆ అధికారి ఇద్దరు అటెండర్లను నియమించుకున్నట్టు సమాచారం. సదరు ఉన్నతాధికారి గతంలో ఏసీబీ దాడుల్లో పట్టుబడిన వ్యక్తుల్లో ఒకరు కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు