ఇసుకపై పచ్చ డేగల కన్ను

3 Nov, 2014 02:03 IST|Sakshi
ఇసుకపై పచ్చ డేగల కన్ను
  • పదేళ్ల తర్వాత రీచ్‌ల డీ నోటిఫై
  • డ్వాక్రా సంఘాలకు ఐదురీచ్‌లు అప్పగింత
  • మరో నాలుగు రీచ్‌ల గుర్తింపు
  • సంఘాల మాటున ‘దేశం’ మాఫియా
  • సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ఇసుకరీచ్‌ల తవ్వకాలపై నిషేధం అమలులో ఉండడంతో పదేళ్లుగా గోదావరి జిల్లాలే ఆధారమయ్యాయి. జిల్లాలో శారదా, తాండవ నదులతో పాటు రైవాడ, కోనాం, కల్యాణపులోవ , మేఘాద్రిగెడ్డ, గంభీరం, బొడ్డేరు, తాచేరు రిజర్వాయర్లు న్నాయి. వీటిల్లో లక్ష క్యూబి క్ మీటర్ల ఇసుక నిల్వలుంటాయి. కానీ జిల్లా అవసరాలకు 5 లక్షల నుంచి 10 లక్షల క్యూబిక్‌మీటర్ల వరకు అవసరమవుతుందని అంచనా.

    ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చి రాగానే ఇసుకమాఫియాకు ఊతమిచ్చే రీతిలో జిల్లాలో ఇసుక తవ్వకాలపై ఉన్న నిషేధాన్ని టీడీపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న పర్యావరణ బోర్డుకు కొత్త పాలకమండలిని నియమించడం..ఆ వెంటనే జిల్లాలో  గుర్తించిన ఐదు రీచ్‌లకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయించడం చకచకా జరిగిపోయాయి. అనుమతులు మంజూరైన రీచ్‌లను డీనోటిఫై చేసి ఎంపిక చేసిన డ్వాక్రా సంఘాలకు కట్టబెట్టారు.

    చీడికాడ మండలం కోనాం ఇసుక రీచ్‌ను పాలవెళ్లి జలాశయం ఇసుక సహకార సంఘంగా ఏర్పడిన కోనాం గ్రామైక్య సంఘానికి కేటాయించారు. వి.మాడుగుల మండలం సగరం, మాకవారిపాలెం మండలం జి.కోడూరు, యలమంచలి మండలం ఏటికొప్పాక, కోటవురట్ల మండలం పండూరు రీచ్‌లను ఆయా గ్రామాల పరిధిలో ఉండే శాండ్‌అండ్ మైనింగ్ ఉమెన్స్ మాక్ లిమిటెడ్‌గా ఏర్పడిన గ్రామైక్యసంఘాలకే కేటాయించారు.
     
    అందుబాటులో 55 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక

    ఈరీచ్‌ల పరిధిలో అధికారికంగా 45 వేల క్యూబిక్‌మీటర్ల ఇసుక ఉన్నట్టుగా గుర్తించి నోటిఫై చేశారు. ఈఇసుక తవ్వకాలకు గ్రీన్‌సిగ్నెల్‌ఇవ్వగా, ఇప్పటికే కోనాం రీచ్‌లో తవ్వకాలు మొదలయ్యాయి. ఇక హుకుంపేట మండలం పెగదరువు, దిగుడుపుట్టు, పెదబయలు మండలం మంగబంద, డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామాల్లో కూడా సుమారు 10వేల క్యూబిక్ మీటర్ల ఇసుకఅందుబాటులో ఉన్నట్టుగా ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ రీచ్‌లలో ఏ మేరకుఇసుక అందుబాటులో ఉన్నది..ఎంత లోతు వరకు తవ్వుకోవచ్చో తక్షణం తనిఖీచేసి రెండు రోజుల్లో ఫీజుబులిటీ రిపోర్టు ఇవ్వాలని  జిల్లా సాండ్ కమిటీ మైనింగ్ శాఖ అధికారులను ఆదేశించింది. వీటిని కూడా ఆయా గ్రామాలపరిధిలోని డ్వాక్రా సంఘాలకే కేటాయించనున్నారు.
     
    రైతు సాధికారిక  సంస్థకు 75 శాతం ఆదాయం

    జిల్లా పరిధిలో తవ్వకాలు జరిపితే క్యూబిక్‌మీటర్‌కు రూ.40 చొప్పున సీనరేజ్ కింద చెల్లిం చాల్సి ఉంటుంది. ఈ మొత్తం పూర్తిగా జిల్లాపరిధిలోని స్థానిక  సంస్థల ఖాతాకు జమవుతుంది. యూనిట్ ఇసుక రూ.1500లుగా జిల్లా సాండ్‌కమిటీ నిర్ధారించింది. ఈ మొత్తంలో సీనరేజ్, ఖర్చులు కింద రూ.500 పోనూ మిగిలిన రూ.వెయ్యిలో రూ. 250 సంబంధిత డ్వాక్రా సంఘాని కి..మిగిలిన రూ.750 రుణమాఫీ కోసం ఏర్పాటు చేసిన రైతు సాధికారిక సంస్థకు జమవుతుంది.
     
    విక్రయాలకు జిల్లాకో ఫెడరేషన్

    జిల్లా అససరాలకు పొరుగు జిల్లాల నుంచి ఇసుక కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిం చేందుకు వీలుగా మండలానికో ఫెడరేషన్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతుంది. తొలిదశలో పాయక రావుపేట, అనకాపల్లి, ఆనందపురం, పెందుర్తిలలో నాలుగు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లోని రీచ్‌ల వద్ద డ్రాక్వా సంఘాల నుంచి కొనుగోలు చేసిన ఇసుకను జిల్లాలో ఈ ఫెడరేషన్ల ద్వారానే విక్రయిస్తారు. ఎవరికి ఎన్నిలక్షల క్యూబిక్‌మీటర్లఇసుక అవసరమున్నా..ఈ ఫెడరేషన్‌ను సంప్రదిస్తే నిర్ణీత గడువులో సరఫరా చేస్తారు.
     
    ‘దేశం’ నేతల కనుసన్నల్లోనే అమ్మకాలు

    కానీ వాస్తవానికి ఈ సంఘాలు, ఫెడరేషన్ల మాటున ఇసుకవ్యాపారం చేసేదంతా అధికార పార్టీ నేతలే. ఇప్పటికే గుర్తించిన ఇసుక రీచ్‌లను స్థానిక టీడీపీ నేతలు చేజిక్కించుకున్నారు. పొరుగు జిల్లాల నుంచి ఇసుకను తరలించి విక్రయించేందుకు ఏర్పాటు చేసినఫెడరేషన్‌లను కూడా వీరుతమ గుప్పెట్లో పెట్టుకుని వ్యాపారం సాగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తెరవెనుక తతంగం నడుపుతున్నట్టు సమాచారం. అధికారికంగా 45వేలక్యూబిక్ మీటర్ల ఇసుకనే నోటిఫై చేసినప్పటికీ ఈ అనుమతులను అడ్డం పెట్టుకుని జిల్లాలో లక్షన్నర క్యూబిక్ మీట ర్ల వరకు ఇసుక తవ్వకాలు జరిపే అవకాశాలు లేకపోలేదు. పెరుగుతున్న పారిశ్రామిక, నిర్మాణరంగ అవసరాలను సొమ్ముచేసుకుంటూ ఇసుకమాఫియా మరింత రెచ్చి పోయే అవకాశాలున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమ వుతుంది.

మరిన్ని వార్తలు