విదేశాల నుంచి వచ్చిన వారిపై వైద్యారోగ్యశాఖ దృష్టి
పలువురికి గృహ నిర్బంధం
శృంగవరపుకోట: విదేశాల నుంచి వచ్చిన వారి కుటుంబాలపై వైద్యారోగ్యశాఖ సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎస్.కోట పట్టణంలో పందిరప్పన్న జంక్షన్లో ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు మార్చి 16వ తేదీన దుబాయ్ నుంచి, శ్రీనివాసకాలనీలో ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఈనెల 18న అండమాన్ నుంచి, రామ్నగర్లో ఉంటున్న ఇద్దరు ఫిబ్రవరి 21న యూఎస్ఏ నుంచి, ముస్లింవీధికి చెందిన మహిళ ఈ నెల 15న మక్కా నుంచి ఎస్.కోటకు వచ్చారు. దీంతో ఆదివారం వారి ఇళ్లకు కొట్టాం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఎం.ఫణీంద్ర, శ్యామ్సుందర్, శరత్చంద్ర, శంకర్రావు, రామకృష్ణ వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. దీంతో పాటూ కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
14 రోజులు స్వీయ గృహ నిర్బంధం
శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలంలోని కొట్టాం, రేవళ్లపాలెం, సీతారాంపురం, వినాయకపల్లి, సంతగైరమ్మపేట, తిమిడి పంచాయతీ వేచలపూడి, ఎస్.కోట శివారు పందిరప్పన్న జంక్షన్, శ్రీనివాసకాలనీ, ముస్లిం వీధి, రామ్నగర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 14మంది సింగపూర్, అమెరికా, ఫిలిప్పీన్స్, దుబాయ్, మలేసియా, మక్కా తదితర దేశాల నుంచి వచ్చారు. వీరిలో ఐదుగురు వ్యక్తులు 14 రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న గడువు కూడా ముగిసిందని కొట్టాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ముమ్ములూరి ఫణీంద్ర తెలిపారు. ఆదివారం మండలంలోని బొడ్డవర, కొట్టాం, శృంగవరపుకోట తదితర గ్రామాల్లో ఉన్న సచివాలయాలను వైద్య సిబ్బంది సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి ఫణీంద్ర మాట్లాడుతూ సుమారు 14మంది విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. వీరిలో ఎవరికీ కూడా కరోనా వ్యాధి లక్షణాలు లేవని పేర్కొన్నారు. వీరందరినీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 14 రోజులు గృహ నిర్బంధంలో స్వచ్ఛందంగా ఉండాలని నోటీసులు అందజేశామన్నారు. రోజూ గృహనిర్బంధంలో ఉన్న వారి ఇళ్లకు వైద్య సిబ్బంది వెళ్లి బీపీ, షుగర్, జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలను పరీక్షిస్తున్నామని తెలిపారు. కొట్టాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సీహెచ్ఓ ఎం.తారకరావు, నర్స్, ఏఎన్ఎంలు విధి నిర్వహణలో ఉన్నారు. డాక్టర్ ఫణీంద్ర వెంట సూపర్వైజర్లు శరత్శ్చంద్ర, వైద్య సిబ్బంది ఉన్నారు.