ఆరోగ్య ప్రదాత వైఎస్సార్‌

20 Mar, 2019 10:52 IST|Sakshi
కేంద్రాస్పత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డు  

పేదల కోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేసిన మహనీయుడు

కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పేదవాడు అడుగు పెట్టేలా చేసిన ఘనుడు

చాలామందికి పునర్జన్మ ప్రసాదించిన ముక్తి ప్రదాత

సాక్షి, విజయనగరం ఫోర్ట్‌: 2004 సంవత్సరానికి ముందు పేదోడికి గుండె ఆపరేషన్‌ చేయాలంటే ఇల్లో, భూమో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. లేకుంటే ఎక్కడో చోట రూ.లక్ష అప్పు చేయాల్సిన దుస్థితి. పొరపాటున క్యాన్సర్‌ వస్తే వైద్యం చేయించుకోలే మంచాన పడి, చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితులను తన పాదయాత్రలో భాగంగా చూసిన మహానేత వైఎస్‌.రాజశేఖరరెడ్డి చలించిపోయి పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించడంపై దృష్టి సారించారు. ఇలా అధికారంలోకి వచ్చారో లేదో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. అంతే పేదోడి జీవితం మారిపోయింది. జబ్బు చిన్నదైనా, పెద్దదైనా హుందాగా కార్పొరేట్‌ ఆస్పత్రికి తెల్లకార్డు పట్టుకుని వెళ్లి ఎంత డబ్బైనా ఇబ్బంది లేకుండా వైద్యం చేయించుకునేవాడు.


పేదలకు కార్పొరేట్‌ ఆస్పత్రుల ఘన స్వాగతం..
ఆరోగ్య శ్రీలో భాగంగా కార్పొరేట్‌ ఆస్పత్రికి గుండె ఆపరేషన్లు, క్యాన్సర్, గైనిక్‌ సమస్యలు, జనరల్‌ సమస్యలతో వెళిలే అక్కడి సిబ్బంది సాదరంగా ఆహ్వానించేవారు. జీవితంలో తాము కార్పొరేట్‌ ఆస్పత్రిలో అడుగుపెడతామని ఊహించి ఉండని వారు కూడా ఆరోగ్య శ్రీ పథకం వల్ల దీమాగా కార్పరేట్‌ ఆస్పత్రికి వెళ్లి వైద్యం పొందేవారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి లెక్కకు మిక్కిలి మంది వైద్యం చేయించుకున్నారు.


పూర్తిగా ఉచిత వైద్యం.. 
 ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు చేతిలో చిల్లిగవ్వలేకపోయినా కార్పొరేట్‌ ఆస్పత్రుల వారు సైతం పిచిలి మరి వైద్యం చేసేవారు. దీంతో పేదవాడికి ఎంత పెద్ద జబ్బు వచ్చినా భయపడేవారు కాదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది మాకు చింత ఎందుకు అనే భావనలో ఉండేవారు. ఉచిత వైద్యంతో పాటు రోగి డిశార్జి అయిన తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు వారం, పది రోజులకు సరిపడా మందులు, రవాణా ఛార్జీలు కూడా ఇచ్చి పంపించే వారు. రోగికి ఒక్క రుపాయి కూడా ఖర్చు కాకుండా పూర్తి ఉచితంగా వైద్యం అందించేవారు. 

 చచ్చి బతికా..
నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలో తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. తల్లిదండ్రులు 108లో కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్‌ అవసరమని చెప్పారు. అనంతరం ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా ఆపరేషన్‌ చేసేశారు. కడుపునొప్పి కారణంగా ఎక్కడ చనిపోతానో అని అందరూ బెంగ పెట్టుకున్నారు. నేనే ఈ రోజు బతికున్నానంటే కారణం వైఎస్సార్‌. ఆ జన్మాంతం ఆయనకు రుణపడి ఉంటా.                          

– ఎస్‌.త్రినాథ్, పెదవేమలి, గంట్యాడ.

మరిన్ని వార్తలు