భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు 

3 Dec, 2019 04:58 IST|Sakshi

గత నెలలో 22.31% తగ్గుదల  

సగానికి పైగా పడిపోయిన బీర్ల అమ్మకాలు

సాక్షి, అమరావతి: దశలవారీగా మద్య నిషేధం అమలు చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మద్యం అమ్మకాలు రోజురోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. గత ఏడాది నవంబర్‌ నెలలో అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది నవంబర్‌ మద్యం అమ్మకాల్లో 22.31 శాతం మేర తగ్గుదల నమోదైంది. గత ఏడాది నవంబర్‌లో బీర్ల అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది నవంబర్‌లో సగానికి పైగా అమ్మకాలు తగ్గాయి. గతేడాది కంటే ఈ నవంబర్‌లో 54.30% తగ్గుదల నమోదైంది.



షాపుల్ని తగ్గించి.. వేళల్ని నియంత్రించటమే కారణం
గతంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను ప్రభుత్వం 3,500కు తగ్గించింది. విక్రయ వేళల్ని ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు పరిమితం చేశారు. కొత్త మద్యం విధానంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అమ్మకాలు తగ్గాయని, ప్రైవేట్‌ వ్యక్తుల ప్రమేయం లేకపోవడం, వేళల్ని కచ్చితంగా పాటించడంతో మద్యం విక్రయాలు క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గతంలో పర్మిట్‌ రూములతో కొన్నిచోట్ల, పర్మిట్లు లేకుండా మరికొన్ని చోట్ల మద్యం సేవించేవారు. ఇప్పుడు పర్మిట్‌ రూములను రద్దు చేయడంతో మద్యం షాపులు కేవలం అమ్మకానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. గ్రామాల్లోని బెల్ట్‌ షాపులను ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు తొలగించడంతో అక్కడా మద్యం వినియోగం భారీగా తగ్గింది.

మరిన్ని వార్తలు