ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద ఉధృతి.. అధికారుల అప్రమత్తం

14 Aug, 2019 10:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌ను వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ప్రకాశంలోని 72 గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం  కొనసాగుతుండడంతో  అధికారులు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. బుధవారం  ఉదయం జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, జేసీ మాధవీలత ప్రాజెక్టును పరిశీలించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 4లక్షల 40వేల క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ ప్లో ఆరులక్షల క్యూసెక్కులకు మించితే లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాసాలను సిద్ధం చేశామని కలెక్టర్‌ తెలిపారు. పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశామని, మత్యకారులు వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. వరద మరింత పెరిగినా.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, రెస్క్యూ టీంలు కూడా సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద గంటగంటకూ పెరుగుతుండటంతో దిగువకు విడుదల చేస్తున్న వరద పరిమాణాన్ని అధికారులు పెంచుతూ పోతున్నారు. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల్లో సర్కార్‌ హైఅలర్ట్‌ను ప్రకటించింది.

మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 164కు చేరింది. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ఈరోజు సాయంత్ర వరకు వరద ఇదే విధంగా కొనసాగితే ప్రాజెక్టు నిండుకుండాల మారనుంది.  ఎగువన శ్రీశైలం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో నాగార్జున సాగర్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 312 టీఎంసీలుగా.. ప్రస్తుతం 281టీఎంసీలు నీటినిల్వ ఉంది. దీంతో ప్రాజెక్టులోని పూర్తి26 గేట్ల ద్వారా నీటికి దిగువకు వదలుతున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు