కృష్ణాకు భారీ వరద.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత

10 Sep, 2019 09:28 IST|Sakshi
ప్రకాశం బ్యారేజీల  వద్ద  వరద ఉధృతి

పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ

భారీగా చేరుతున్న వరద

శ్రీశైలం, సాగర్‌, ప్రకాశం గేట్ల  ఎత్తివేత

ఎగువన కురుస్తున్న వర్షాలకు మళ్లీ వరద పోటెత్తుతోంది. జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి దృష్ట్యా అధికారులు మంగళవారం ఉదయం సాగర్‌ రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల నుంచి పులిచింతలకు.. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేశారు. గత వరద ముంపును దృష్టిలో పెట్టుకుని అధికారులు నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌, ప్రకాశం బ్యారేజీల  వద్ద  వరద ఉధృతి కొనసాగుతోంది.


ప్రకాశం బ్యారేజీ

సాక్షి, శ్రీశైలం:  కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి  శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రం నుంచి మొదలైన వరద మంగళవారం ఉదయానికి భారీగా పెరిగింది.  ఈ క్రమంలో  శ్రీశైలం ప్రాజెక్టులో  6 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 3.39 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌లోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సాగర్‌ నిండుకుండలా దర్శనమిస్తోంది. వరద ఉధృతిని దృష్ట్యా అధికారులు సోమవారం సాయంత్రం నాగార్జున సాగర్‌ 16 రేడియల్‌ క్రాస్ట్‌గేట్లు ఎత్తి 2,94,300 క్యూసెక్కులు నీటిని దిగువ పులిచింతల ప్రాజెక్టులోకి విడుదల చేశారు. ఈ క్రమంలో పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట నీటి మట్టం 45.77 టీఎంసీలకు చేరడంతో దిగువ ప్రకాశం బ్యారేజీకి 50 వేలు క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీలో గరిష్ట నీటిమట్టం నమోదుకావడంతో.. కాలువలకు విడుదల చేసే నీరు పోను, దిగువకు 18,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  ప్రాజెక్టులోని  45 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.  


శ్రీశైలం

లంక గ్రామాల ప్రజల అప్రమత్తం..
కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో నదీ పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు 15 నాటికే నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ నిండింది. జిల్లాలోని అన్ని జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో వచ్చిన వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత వరద ముంపు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


నాగార్జున సాగర్‌

కాలువలకు పుష్కలంగా నీరు విడుదల..
జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో నాగార్జున సాగర్‌ కుడికాలువకు 10,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తాగునీటి చెరువులను పూర్తిగా నింపారు. సాగునీటి అవసరాలకు సరిపోను నీరు మిగులు ఉండటంతో 1500 క్యూసెక్కుల నీటిని గుండ్లకమ్మ వాగులోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తిగా నిండటంతో జిల్లాలో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. (చదవండి: ఉధృతంగా గోదావరి)

మరిన్ని వార్తలు