అపార నష్టం

2 Mar, 2014 00:58 IST|Sakshi
అపార నష్టం

లోకేశ్వరం, న్యూస్‌లైన్ :  మండలంలోని పుస్పూర్, హథ్‌గాం, సాథ్‌గాం, రాయపూర్‌కాండ్లీ, ధర్మోరా, పంచగుడి, పిప్రి, వాట్టోలి, గడ్‌చాంద, రాజూరా, మన్మద్, పోట్‌పల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో వర్షం కురియడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

మొక్కజొన్న, జొన్న, మిర్చి, నువ్వు, పొద్దుతిరుగుడు, పసుపు పంటలకు నష్టం వాటిల్లింది. పుస్పూర్ గ్రామంలో స్వల్పంగా వడగండ్లు పడ్డాయి. పంటలకు నష్టం వాటిల్లినా అధికారులు గ్రామాలను సందర్శించడం లేదని రైతులు వాపోతున్నారు. నష్టం అంచనా వేసి పరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు.

 ఖానాపూర్‌లో..
 ఖానాపూర్ : మండలంలో గత రెండు రోజులుగా కురిసిన గాలీ వాన బీభత్సంతో పాటు  రాళ్ల వర్షం కారణంగా రైతుల పంటలు తీవ్రంగా నష్టపోయారు. వరి, మొక్కజొన్నతో పాటు నువ్వు, కురగాయలు, మామిడి రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు.
 
 అతలాకుతలం..
 కడెం : మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వర్షం, ఈదురుగాలులతో పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. పెద్దూరు, మద్దిపడగ, ధర్మాజీపేట, చిన్నబెల్లాల్ తదితర గ్రామాల్లో వరి, పెసర, నువ్వు, మిరప, మొక్కజొన్న, పసుపు, ఉల్లి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. సుమారు 250 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ధర్మాజిపేట గ్రామానికి చెందిన రైతు మంతెన సత్యం సాగుచేసిన నువ్వు పంట వర్షం ధాటికి నాశనమైంది. కోళ్లఫారంలో 200 కోళ్లు మృత్యువాతపడ్డాయి.

పెద్దూరులో దండికె గంగన్న, సంగ మల్లయ్య, చిట్టేటి ముత్తన్న, గజ్జి ఎర్రన్న, సంగ పోషన్న, తౌర్య, బలరాం నాయక్, రవినాయక్ తదితరుల పంటలు దెబ్బతిన్నాయి. దండికె గంగన్నకు చెందిన మిరప పంట పూర్తిగా నేలకొరిగింది. పెద్దూరు తండాలోని ఇస్లావత్ బలరాంనాయక్ పసుపును ఉడకబె ట్టి ఆరబెట్టాడు. అది వర్షానికి తడిసి ముద్దయింది. అంబారీపేట, పాండ్వాపూరు గ్రామాల్లో కొన్ని ఇళ్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. పంటల నష్టం వివరాలను వీఆర్వోలు శనివారం నుంచి సర్వే చేస్తున్నారు.
 
 నేలకొరిగిన పంటలు
 తానూరు : మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసి న వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్ల వాన ధాటి కి 1600 ఎకరాల్లో గోధుమ, జొన్న పంటలు నేలకొరిగా యి. ఎల్వీ, హిప్నెల్లి, హిప్నెల్లితండా, ఉమ్రి, మసల్గతం డా గ్రామాల్లో నేలకొరిగిన పంటలను చూసి రైతులు తీ వ్ర ఆవేదనకు గురయ్యారు. హిప్నెల్లి గ్రామంలో గాలి ధాటికి 24ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. ఇళ్లలోని బట్ట లు, ఆహార ధాన్యాలు తడిసిపోయాయి. శుక్రవారం రా త్రంతా పక్క ఇళ్లలో తలదాచుకున్నారు.

వర్షంతో నిరాశ్రయులుగా మారినా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో శనివా రం గ్రామస్తులు బెల్‌తరోడ, తానూర్ ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. తహశీల్దార్ అంజయ్య అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున పరిహారం ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. గాలుల ప్రభావంతో విద్యుత్ తీగలు తెగిపోయి మండలంలో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హిప్నెల్లి గ్రామంలో బాధితులకు టీడీపీ నియోజకవర్గ నాయకులు, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న వచ్చి 3 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు