నర్సీపట్నం, న్యూస్లైన్: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గురువారం జిల్లా అంతటా వర్షం పడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. నర్సీపట్నం, గొలుగొండ, కోటవురట్ల, నాతవరం వర్షం కురిసింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో గొలుగొండ మండలం బొడ్డేరుగెడ్డ, దారగెడ్డతో పాటు సర్పానదుల్లో నీరు చేరింది. ఐదు రోజులుగా ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పాడేరు ప్రాంతంలో మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా వానపడింది. జీకే వీధి, చింతపల్లి, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు మండలాల్లో జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. మన్యంలో ప్రధానమైన పెద్దగెడ్డ, రాళ్లగెడ్డల్లో నీటి ఉధృతి పెరిగింది. జోలాపుట్టు రిజర్వాయర్కు నీరం దించే మత్స్యగెడ్డ పరవళ్లు తొక్కుతోంది. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోనూ కురుస్తున్న వర్షాలకు చెరువుల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది.
పంటకాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. యలమంచిలి, అచ్యుతాపురం మండలాల్లో ఒక మోస్తరుగా, రాంబిల్లి, మునగపాక మండలాల్లో భారీగా వర్షం పడింది. నక్కపల్లి, ఎస్.రాయవరం, కోట వురట్ల, పాయకరావుపేట మండలాల్లోనూ ముంచెత్తిన వానకు వరాహ, తాండవ నదుల్లో నీటి ఉధృతి పెరిగింది. ఇది మెట్ట పంటలకు అనుకూలిస్తుందని రైతులు ఆనందపడుతున్నా రు. మెరక ప్రాంతాల్లో ఆలస్యంగా వేసిన వరినాట్లుకు మేలు చేకూరుతుందని అంటున్నారు.