సాక్షి, విజయవాడ : ప్రమాద స్థాయికి మించి ప్రకాశం బ్యారేజ్కు వరదనీరు చేరుతుండటంతో సమీప పరివాహక ప్రాంతాలకు వరదముప్పు పొంచి ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీచేశారు. ఈ రాత్రికి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అధికారుల హెచ్చరికలతో అప్రమత్తమైన పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ తోట్లవల్లూరు మండలంలో ఇప్పటికే నీటమునిగిన తోడేలు లంక గ్రామాన్ని నాటుపడవపై వెళ్లి పరిశీలించారు. గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాసాలకు వెళ్లాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. మండలంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, రెస్క్యూ టీమ్లను, సరిపడా సిబ్బందిని మండలానికి పంపాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు.