హీరాలాల్‌ కంపెనీ లాకౌట్‌

28 Aug, 2018 12:12 IST|Sakshi
లాకౌట్‌ ప్రకటించడంతో చర్చలకు వెళ్తున్న కంపెనీ ఉద్యోగులు  

బొబ్బిలి : గ్రోత్‌ సెంటర్‌లో ఇటీవల హీరాలాల్‌ కంపెనీ కార్మికులు, సంస్థ యాజమాన్యం మధ్య జరిగిన గొడవ చివరికి లాకౌట్‌కు దారి తీసింది. వచ్చే నెల 7 నుంచి కంపెనీకి లాకౌట్‌ విధిస్తున్నట్టు యాజమాన్యం సంస్థ గేటుకు  నోటీసును అంటించింది. సుమారు 150 మంది కార్మికులు, ఇతర ఉద్యోగులు మరో 50 మంది ఉన్న ఈ సంస్థలో సంఘం ఏర్పాటు చేస్తున్నారనే కారణంగా యాజమాన్యం ఏడుగుర్ని తొలగించింది.

దీంతో కార్మికులంతా ఏకమై విధులను ఇటీవల బహిష్కరించారు. లాకౌట్‌ ప్రకటనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆర్‌వీఎస్‌కేకే రంగారావుకు వినతిపత్రం అందజేసి చర్చల్లో పాల్గొన్నారు. కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో మూత పడనివ్వమని బేబీనాయన హామీ ఇచ్చినట్టు ఉద్యోగ వర్గాల ప్రతినిధి జగదీష్‌ తెలిపారు. 

సంఘం నమోదైనందునే..

కార్మిక సంఘాన్ని కంపెనీలో ఏర్పాటు కాకుండా అడ్డుకునేందుకు యాజమాన్యం సకల ప్రయత్నాలూ చేసింది. ఇటీవలే మాకు కార్మిక శాఖలో మా సంఘం నమోదై నంబర్‌ కూడా వచ్చేసింది. సంఘం వద్దన్నా రిజిస్ట్రేషన్‌ చేయించేశామన్న దుగ్ధతోనే యాజమాన్యం ఇప్పుడు ఉద్యోగులనూ తొలగించేందుకు వీలుకాక ఏకంగా లాకౌట్‌కు సిద్ధపడింది.

– పొట్నూరు శంకరరావు, సీఐటీయూ నేత

మరిన్ని వార్తలు