కోడి పందేలపై మరోసారి హైకోర్టు సీరియస్‌

29 Jan, 2018 19:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : కోర్టు ఆదేశాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలు యథేచ్చగా సాగడంపై హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టు సోమవారం మరోసారి సీరియస్‌ అయింది. కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీ, లా సెక్రటరీలను పందేలను ఎందుకు కట్టడి చేయలేదని ప్రశ్నించింది.

కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సాక్షాత్తు ప్రజా ప్రతినిధులే కోడి పందేలను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించింది. సంక్రాంతి పర్వదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కోడి పందేలపై ఎన్ని కేసులు నమోదయ్యాయని, ఎంత మంది అరెస్టు చేశారో పూర్తి వివరాలను కోర్టుకు అందజేయాలని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ, చీఫ్‌ సెక్రటరీలను ఆదేశించింది.

ఇందుకు స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరాలు అందజేసేందుకు నాలుగు వారాల గడువు కోరారు. అందుకు అనుమతించిన న్యాయమూర్తి కేసు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు