రేపటి నుంచి ‘ఉమ్మడి’ హైకోర్టు

1 Jun, 2014 02:45 IST|Sakshi
రేపటి నుంచి ‘ఉమ్మడి’ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సేవలు
- అధికారిక నోటిఫికేషన్ విడుదల
- వేసవి సెలవుల తర్వాత
- 2న హైకోర్టు పునఃప్రారంభం
- ప్రవేశంపై భద్రతా కారణాలతో ఆంక్షలు

సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా న్యాయసేవలు అందించనుంది. జూన్ 2 అపాయింటెడ్ డే కావడంతో పాటు అదే రోజున హైకోర్టు వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ‘హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా ఉన్నా సోమవారం నుంచి ‘హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన చట్టంలోని సెక్షన్ 30కి అనుగుణంగా ఈ మార్పులు చేశారు. ఇందుకు సంబంధిం చి హైకోర్టు రిజిస్ట్రార్  జనరల్ కె.శివప్రసాద్ శని వారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రకారం జూన్ 2 నుంచి కక్షిదారులు, న్యాయవాదులు కొత్త పేరు మీదనే పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

 హైకోర్టు ఉత్తర్వులు, ఇతర ఉత్తరప్రత్యుత్తరాలన్నీ ఇదే పేరు మీద ఉంటాయి.  ఇదిలాఉండగా, ఉమ్మడి హైకోర్టును తెలంగాణ న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో హైకోర్టులో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని నిఘా వర్గాలు నివేదికలు ఇచ్చాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ నుంచి కూడా హైకోర్టుకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో న్యాయవాదులు, కక్షిదారుల ప్రవేశానికి సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ శివప్రసాద్ కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు.

భద్రతా కారణాల రీత్యా తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు ఇవి అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఈమేరకు సరైన కారణం చెప్పకుంటే హైకోర్టులో ప్రాక్టీస్ చేయని న్యాయవాదులనెవర్నీ అనుమతించరు. భద్రతా సిబ్బందికి హైకోర్టు న్యాయవాదులు, ఇతరులు తమ గుర్తింపు కార్డులు చూపాల్సి ఉంటుం ది. కక్షిదారుల గుర్తింపునకు సంబంధించి సమస్య వస్తే వారి న్యాయవాది భద్రతా సిబ్బందికి తెలియజేయాలి.

మరిన్ని వార్తలు