ముసుగు కాదు..బొమ్మే తీసేయండి

20 Apr, 2018 06:42 IST|Sakshi
గడియార స్తంభంపై ఉన్న ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ బొమ్మపై ముసుగు వేసిన మున్సిపల్‌æఅధికారులు

గడియార స్తంభంపై ఎమ్మెల్సీ ఫొటో తొలగించాలని హైకోర్టు ఆదేశం

బాపట్ల మున్సిపల్‌ అధికారులపై మరోసారి ఆగ్రహం

బాపట్ల: ‘‘వందేళ్ల చరిత్ర కలిగిన గడియార స్తంభాన్ని కూల్చేస్తే.. అందరం కలిసి విరాళాలు వేసుకుని గడియార స్తంభాన్ని నిర్మించాం...ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ బొమ్మను తొలగిస్తే స్తంభం దెబ్బతినే ప్రమాదం ఉంది’ అంటూ బాపట్ల మున్సిపాలిటీలోని తెలుగుదేశం పార్టీకి చెందిన వైస్‌ చైర్మన్‌ లేళ్ల రాంబాబుతోపాటు ఆ పార్టీ కౌన్సిలర్లు చాటకొండ సాయిరామ్, ఐనంపూడి యోహోషువా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు చరిత్ర కలిగిన గడియార స్తంభాలపై ఇతరుల ఫొటోలు ఉండరాదని, బొమ్మకు వేసిన ముసుగు తొలగించి రంగు వేయించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. బొమ్మలు తొలగించటం, హోర్డింగ్‌ విషయంలో అలసత్వాన్ని ఏమాత్రం సహించేది లేదంటూ హైకోర్టు  తేల్చి చెప్పింది. బాపట్ల పట్టణంలోని గడియార స్తంభంపె ఎమ్మెల్సీ బొమ్మ, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలపై హైకోర్టు మండిపడింది.

మున్సిపల్‌ అధికారులపై మరోసారి అగ్రహం
పట్టణంలో రాజకీయ నాయకుల బొమ్మలను ప్రారంభోత్సవ పలకలపై వేయటం,  అనధికారికంగా హోర్డింగ్‌ పెట్టడంపై అగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. మళ్లీ టీడీపీకి చెందిన కౌన్సిలర్లు కోర్టును ఆశ్రయించటంతో అధికారులకు అక్షింతలు వేసింది. బొమ్మలను ఉంచటం వలననే వాటిపై కోర్టులను ఆశ్రయిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. వెంటనే బొమ్మలున్న ప్రదేశంలో రంగులు వేయించాలంటూ సూచించింది.  

మరిన్ని వార్తలు