40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు
హెచ్చరించిన కలెక్టర్ హరికిరణ్
సాక్షి కడప/సిటీ : సూర్య ప్రతాపానికి జనం జంకుతున్నారు. భానుడు భగభగ మండిపోతుండడంతో ప్రజలు ఉదయం నుంచే బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. గత ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వడదెబ్బతో పలువురు మరణించారు. ప్రస్తుతం సాయంత్రం సమయంలో కూడా వేడి ప్రభావం తగ్గడం లేదు. సెగ కూడా కనిపిస్తోంది. ఈనెల ప్రారంభం నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. వారం రోజులుగా కడపలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత దాటుతోంది. కరోనా నేపథ్యంలో జనం బయటకు రాకపోవడంతో కొంత మేలు జరుగుతోంది.
రాబోయే రెండు రోజుల్లో జిల్లాలో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని జిల్లా కలెక్టరు హరికిరణ్ బుధవారం హెచ్చరించారు. వృద్ధులు, పిల్లలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. తాగునీరు తగినంతగా తీసుకోవాలి. పలుచని వస్త్రాలు ధరించాలని, అత్యవసర వైద్య సేవలకు వచ్చేవారు టోపీ ధరించాలి. లేదా గొడుగు లేదా వస్త్రం లాంటివి ధరించాలి. అత్యవసరమైతే వైఎ స్సార్ టెలి మెడిసిన్ వైద్య సేవలకు టోల్ఫ్రీ నెంబరు 14410 లేదా టెలీకన్సెల్టెన్సీ కోసం 08562–244437, 244070 ఫోన్ చేసి వైద్య సేవలు పొందవచ్చునని కలెక్టరు సూచించారు.