హై‘టెన్షన్’ బతుకులు

19 Sep, 2015 04:03 IST|Sakshi

రైల్వేస్టేషన్ : రైల్వేలో విద్యుత్ విభాగం కీలకమైంది. హైటెన్షన్ వైర్లుతో విద్యుత్ సరఫరా అవుతుంటోంది. అయితే అంతరాయం కలిగినప్పుడు కార్మికులు ప్రాణాలుకు కూడా లెక్కచేయకుండా పనిచేయాలి. విభాగంలో సమన్వయలోపంతోనూ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. దీంతో  కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. రైల్వే ట్రాక్ మీద ఉన్న ఇరవై ఐదు వేల కిలోవాట్స్ విద్యుత్ లైన్‌లో ఆరు నెలల కాలంలో పలువురు కార్మికులు ప్రమాదాలకు లోనయ్యారు. 25 వేల    కిలో వాట్స్ విద్యుత్ లైన్‌లో పనిచేసే కార్మికులకు పూర్తిస్థాయిలో రక్షణ కరువైంది. గతంలో విజయవాడకు చెందిన సీనియర్ సెక్షన్ ఇంజినీరు ఓహెచ్‌ఈ ఒకరు గన్నవరం రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే యార్డులో విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు.

ఇదే డిపోలో హెల్పర్‌గా పనిచేస్తున్న కార్మికుడు కొండపల్లి యార్డులో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. విజయవాడ డివిజన్ పరిధిలోని రేగుపాలెంలో ఒక కార్మికుడు ప్రమాదానికి గురయ్యాడు.  డిసెంబర్ నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోని ఓహెచ్‌ఈ విద్యుత్ విభాగంలోని  పనిచేస్తున్న కార్మికులు ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు. ఎంతో ప్రమాదకరమైన విద్యుత్ లైన్‌లో పనిచేస్తున్న కార్మికుల భద్రత విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు