నలుగురి డ్రైఫ్రూట్స్‌ ఖర్చు 18 లక్షలు

3 Jun, 2019 04:47 IST|Sakshi

ఉన్నత విద్యామండలి నిధులు పప్పు బెల్లాల్లా పంపకం

కమీషన్ల కోసం విద్యార్థుల ఫీజుల స్వాహా

ఆంగ్ల శిక్షణకోసం బ్రిటిష్‌ కౌన్సిల్‌కు రూ.13 కోట్లు

రూ. 4.5 కోట్లతో రెండో విడత ప్రాజెక్టుకు మళ్లీ ఒప్పందం

సీఎం జ్ఞానభేరి ప్రచారాలకు రూ.10 కోట్లు

ఫేక్‌ ఒప్పందాల విదేశీ యాత్రలకు రూ. 5కోట్లు ఖర్చు

వర్సిటీలకు సలహాలిచ్చేందుకు టీడీపీ నేత గంటా అనుచరుడికి రూ. 1.5 కోట్లు చెల్లింపు

సాక్షి, అమరావతి: విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించేందుకు ఏర్పాటయిన ఉన్నత విద్యామండలి అక్రమాల నిలయంగా మారింది.  విద్యా ర్థులు చెల్లించే ఫీజులు, కాలేజీల నుంచి రుసుముల రూపేణా వచ్చే కోట్లాది రూపాయలను కమీషన్ల కోసం పప్పుబెల్లాల్లా కావాల్సిన వాళ్లకు పంపిణీ చేశారు. కేవలం నలుగురు ఉన్నతాధికా రులకు డ్రైఫ్రూట్ల కోసం మూడేళ్లలో రూ.18 లక్షలు ఖర్చు చేశారంటే అక్కడ అవినీతి వ్యవహారం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. కమీషన్లతో పాటు ప్రభుత్వ పెద్దలకు కావలసిన సదుపా యాల కల్పనకు, వారి అనుయాయుల పునరావాసం కోసం ఉన్నత విద్యామండలి నిధులు ఇష్టానుసారంగా ఖర్చుపెట్టేశారు. గత నాలుగేళ్లలో ఈ వ్యవహారం సృతిమించిపోయింది.

శిక్షణ పేరుతో రూ.13 కోట్లు...
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కాలేజీల్లోచదువుతున్న లక్షమంది విద్యార్ధులకు ఆంగ్లంలో కమ్యూనికేషన్‌ స్కిల్స్, వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, తదితర నైపుణ్యాలు పెంచేందుకు బ్రిటిష్‌ కౌన్సిల్‌తో  శిక్షణ ఇప్పించడానికి రూ.13 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. రూ.9 కోట్ల వరకు ఆ సంస్థకు చెల్లించేశారు. తీరా కాలేజీలనుంచి వచ్చిన సమాచారం చూస్తే బ్రిటిష్‌ కౌన్సిల్‌ సంస్థ కేవలం 13వేల మంది విద్యార్ధులకు, 2వేల మంది టీచర్లకు మాత్రమే శిక్షణ ఇచ్చినట్లు తేలింది. అయినా ఉన్నత విద్యామండలి అధికారులు ఆ సంస్థకు రూ.9 కోట్లు చెల్లించారు. మిగతా నిధుల చెల్లింపుపై కూడా ఫైలు రెడీ చేసినట్లు తెలిసింది.రెండో విడత శిక్షణ అంటూ మరో రూ.4.5 కోట్లతో ఒప్పందానికి కూడా ఏర్పాట్లు చేశారు.

దీనిపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి కోసం మండలి ఫైలు పంపగా.. మొదటి ప్రాజెక్టులో తగినంతమందికి శిక్షణ ఇవ్వలేదు కనుక ఆమేరకు మిగతా వారికి రెండో ప్రాజెక్టులో శిక్షణ ఇవ్వాలని, బకాయిలు అప్పుడే ఇస్తామని ఆయన స్పష్టంచేశారు. బ్రిటిష్‌ కౌన్సిల్‌తో ఒప్పందంపై విమర్శలు రావడంతో పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ కూడా ప్రభుత్వ సంస్థ అయిన ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)తో శిక్షణ ఇప్పిస్తే తక్కువ ఖర్చు అవుతుందని నివేదిక ఇచ్చింది. అయినా పాత బకాయిలు మొత్తాన్ని చెల్లించి, రెండో విడత ప్రాజెక్టును రూ.4.5 కోట్లతో బ్రిటిష్‌ కౌన్సిల్‌తో చేపట్టేంరు ఒప్పందం చేసుకోవాలని ఉన్నత విద్యామండలి అధికారులు ఏర్పాట్లు చేయడం విమర్శలకు తావిస్తోంది.

చంద్రబాబు ప్రచారాలకు రూ.10కోట్లు
సాధారణ ఎన్నికలకు ఆరునెలల ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు యూనివర్సిటీల పరిధిలోని విద్యార్ధుల ఓట్లకోసం జ్ఞానభేరి పేరిట ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి యూనివర్సిటీ పరిధిలో సభలను ఏర్పాటుచేసి వాటికి వేలాది మంది విద్యార్ధులను రప్పించారు. దీని ఉన్నత విద్యామండలి నుంచే రూ.10 కోట్లకు పైగా  చెల్లించారు. ఒక్కో సభకు అడ్వర్టయిజ్‌మెంట్ల పేరిట కొన్ని పత్రికలకు రూ.60 లక్షల చొప్పున చెల్లించారు. సీఎం ప్రసంగంతో కూడిన బుక్‌లెట్‌ ఒక్కోదాన్ని వేయి రూపాయలతో ముద్రించి రూ.20 లక్షల వరకు ఖర్చు చేశారు.

ఉపయోగంలేని ఒప్పందాలు... రూ.5 కోట్లు ఖర్చు
విద్యాశాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు వివిధ వర్సిటీలతో ఒప్పందాలంటూ విదేశీయాత్రలు చేశారు. ఇందుకు ఏకంగా రూ.5 కోట్లు ఉన్నత విద్యామండలి నిధులు ఖర్చు చేశారు. తప్పుడు ఒప్పందాల కోసం ఎనిమిది దేశాలు తిరిగి వచ్చారు. ఈ యాత్రల వల్ల, ఒక్క ఒప్పందం వల్ల కూడా వీసమెత్తు ప్రయోజనం కూడా ఒనగూరలేదు. మంత్రి, విద్యాశాఖకు చెందిన కొందరు అధికారులకు కార్లు, ఏసీ రూములు, ఇతర ఏర్పాట్ల కోసం, వేర్వేరు పేషీల్లో కన్సల్టెంట్లు, సలహాదారులుగా నియమితులైన వారికి వేతనాలు, రవాణా తదితర భత్యాల కోసం ఉన్నత విద్యామండలి నిధులు భారీగా ఖర్చుచేయించారు. నేషనల్‌ ర్యాంకింగ్‌ కోసం యూనివర్సిటీలకు సలహాలు ఇచ్చే పేరిట మంత్రి గంటా అనుచరుడికి సంబంధించిన సంస్థతో రూ.1.50 కోట్లతో తప్పుడు ఒప్పందం చేసుకోవడమే కాకుండా, ఎలాంటి ప్రయోజనం చేకూరకున్నా నిధులు చెల్లించారన్న విమర్శలున్నాయి.

ఎల్‌ఈడీ బల్బులకోసం రూ.50 కోట్లు
వర్సిటీల్లో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు వీలుగా రెండు వర్సిటీల్లో  ప్రయోగాత్మక ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం మండలికి సూచించింది. ఒక్కో యూనివర్సిటీలో కనిష్ఠంగా రూ.4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం 2 వర్సిటీల్లోనే చేయాలని చెప్పగా మండలి అధికారులు ఏకంగా 16 యూనివర్సిటీల్లో ఈ ప్రాజెక్టు అమలుకు ఒక ప్రయివేటు సంస్థతో ఒప్పందం చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఎలాంటి డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు లేకుండానే ఇలా ఒప్పందం చేసుకోవడం వల్ల వర్సిటీలు రూ.50 కోట్లవరకు ఆ సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది.

అధికారుల వ్యక్తిగత ఖర్చే రూ. 2 కోట్లు
ఉన్నత విద్యామండలిలోని ఉన్నతస్థాయి అధికారుల వ్యక్తిగత ఖర్చుల కిందే గత మూడేళ్లలో రూ.2 కోట్ల వరకు ఖర్చు చూపించారు. తమ కుటుంబాలను చూడడానికి సొంతూర్లకు వారం వారం వెళ్లిరావడానికి, వివిధ ప్రాంతాలకు విమాన ప్రయాణాలంటూ ఈ నిధులు ఖర్చు చేశారు. డ్రైఫ్రూట్స్‌ కోసం ఏకంగా 18 లక్షల ఖర్చయ్యినట్లు చూపిస్తున్నారు. తమకు సంబంధించిన వారిని అవుట్‌సోర్సింగ్‌లో నియమించుకొని వారికి వేలాది రూపాయలు వేతనాలుగా ఇస్తున్నారు.

చీఫ్‌ సెక్రటరీకి కూడా లేని రీతిలో కొందరికి ఏడాదికి రూ.15వేల వరకు ఇంక్రిమెంటుగా వేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇవి కాకుండా వివిధ సెట్ల నిర్వహణలో నిధుల దుర్వినియోగం, స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియలో అక్రమాలకు అంతే లేదన్న ఆరోపణలున్నాయి వివిధ కమిటీలనున నియమించి వివిధ స్టార్‌ హోటళ్లలో వాటి సమావేశాలకు లక్షల్లో ఖర్చు చేశారు. ఈ కమిటీల నివేదికలను మాత్రం పక్కన పడేశారు. ఈ పనుల పేరుతో కమీషన్లు దండుకోవడానికే ప్రాధాన్యతనిచ్చినట్లు ఆ విభాగంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

బోధనా పోస్టుల భర్తీలోనూ అక్రమాలు...
వివిధ యూనివర్సిటీల్లోని బోధనా పోస్టుల భర్తీ విషయంలో ఉన్నత విద్యా మండలి అధికారులు అక్రమాలకు పాల్లపడ్డారు.  ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే ప్రయివేటుగా ప్రొఫెసర్‌ రాఘవులు కమిటీని ఏర్పాటుచేసి వివిధ పోస్టులను హేతుబద్ధీకరణ చేయించారు. తమకు సంబంధించిన వారికి పోస్టులుండేలా ఒక విభాగం పోస్టును వేరే విభాగాలకు తరలించారు. రిజర్వుడ్‌ పోస్టులను కూడా ఇష్టానుసారంగా మార్చేశారు.1,385 బోధనా పోస్టుల భర్తీకి యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా స్క్రీనింగ్‌ టెస్టును ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించారు. వీటిపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నా వర్సిటీల ద్వారా ఇంటర్వ్యూలను పూర్తిచేయించి నియామకాలు చేయించడానికి కూడా సిద్ధపడ్డారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు.

చదువుతున్న లక్షమంది విద్యార్ధులకు ఆంగ్లంలో కమ్యూనికేషన్‌ స్కిల్స్, వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, తదితర నైపుణ్యాలు పెంచేందుకు బ్రిటిష్‌ కౌన్సిల్‌తో  శిక్షణ ఇప్పించడానికి రూ.13 కోట్ల ఒప్పందం చేసుకున్నారు. రూ.9 కోట్ల వరకు ఆ సంస్థకు చెల్లించేశారు. తీరా కాలేజీలనుంచి వచ్చిన సమాచారం చూస్తే బ్రిటిష్‌ కౌన్సిల్‌ సంస్థ కేవలం 13వేల మంది విద్యార్ధులకు, 2వేల మంది టీచర్లకు మాత్రమే శిక్షణ ఇచ్చినట్లు తేలింది. అయినా ఉన్నత విద్యామండలి అధికారులు ఆ సంస్థకు రూ.9 కోట్లు చెల్లించారు. మిగతా నిధుల చెల్లింపుపై కూడా ఫైలు రెడీ చేసినట్లు తెలిసింది. రెండో విడత శిక్షణ అంటూ మరో రూ.4.5 కోట్లతో ఒప్పందానికి కూడా ఏర్పాట్లు చేశారు.

దీనిపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి కోసం మండలి ఫైలు పంపగా.. మొదటి ప్రాజెక్టులో తగినంతమందికి శిక్షణ ఇవ్వలేదు కనుక ఆమేరకు మిగతా వారికి రెండో ప్రాజెక్టులో శిక్షణ ఇవ్వాలని, బకాయిలు అప్పుడే ఇస్తామని ఆయన స్పష్టంచేశారు. బ్రిటిష్‌ కౌన్సిల్‌తో ఒప్పందంపై విమర్శలు రావడంతో పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ కూడా ప్రభుత్వ సంస్థ అయిన ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)తో శిక్షణ ఇప్పిస్తే తక్కువ ఖర్చు అవుతుందని నివేదిక ఇచ్చింది. అయినా పాత బకాయిల మొత్తాన్ని చెల్లించి, రెండో విడత ప్రాజెక్టును రూ.4.5 కోట్లతో బ్రిటిష్‌ కౌన్సిల్‌తో ఒప్పందం చేసుకోవాలని ఉన్నత విద్యామండలి అధికారులు ఏర్పాట్లు చేయడం విమర్శలకు తావిస్తోంది.

>
మరిన్ని వార్తలు