సైబరా‘డాబు’షా కథ ఇదీ!

4 Dec, 2018 04:32 IST|Sakshi

సైబరాబాద్‌ కట్టింది తానేనని పదేపదే ఊదరగొడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు

చంద్రబాబు సీఎంగా ఉండగా సైబర్‌ టవర్స్‌ ఒక్కటే నిర్మాణం

వాస్తవానికి ఈ టవర్స్‌ నిర్మాణానికి కాంగ్రెస్‌ హయాంలోనే నిర్ణయం

మాదాపూర్‌లో భూములు కేటాయించాలని నిర్ణయించిన అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి

 తర్వాత గద్దెనెక్కిన చంద్రబాబు..‘రియల్‌’ చూపుతోనే ముందుకెళ్లిన వైనం

తనవారితో చౌక ధరలకు భూములు కొనిపించాకే టవర్ల నిర్మాణానికి శ్రీకారం

ఆయన సీఎంగా దిగిపోయేనాటికి హైటెక్‌ సిటీ మొదటి దశా పూర్తికాని వైనం

వైఎస్‌ చర్యలతోనే 2010 నాటికి సైబరాబాద్‌ పూర్తి

హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టింది నేనే.. హైటెక్‌సిటీ కట్టింది నేనే.. ఔటర్‌ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానశ్రయమూ నా ఘనతే.. సైబరాబాద్‌ కట్టింది నేనే.. అసలు తెలంగాణకు ఐటీ తీసుకొచ్చిందీ నేనే.. 
– ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చేసే వ్యాఖ్యలివి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా తనకు అవసరమైన ప్రతి సందర్భంలోనూ సైబరాబాద్‌ నిర్మాత తానే అంటారు. తనకు ఏమాత్రం సంబంధం లేని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకూ క్రెడిట్‌ తీసుకుంటారు. తెలంగాణలో కంప్యూటర్‌ విజ్ఞానాన్ని పరిచేయం చేసింది తానేనని తడుముకోకుండా చెప్పుకుంటారు.

బెంగళూరు
సిలికాన్‌ సిటీని అభివృద్ది చేసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణ దానికి తానే కారణమని ఏనాడూ చెప్పలేదు. 
ముంబై
దీన్ని వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దడమే కాదు, అక్కడ చక్కెర రైతుల అభివృద్దికి తోడ్పడిన శరద్‌ పవార్‌ ఆ ఘనత తనదేనని ఎప్పుడూ గొప్పలు ప్రదర్శించలేదు. 
తమిళనాడు
అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుని తమిళనాడును ముందుకు తీసుకెళ్లిన దివంగత నేత జయలలిత దానికి తానే కారణమని ఏనాడు పొంగిపోలేదు. 

సాక్షి, హైదరాబాద్‌: గడిచిన 25 సంవత్సరాల పరిణామక్రమంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ‘సాక్షి ప్రతినిధి’ ప్రయత్నం చేసినప్పుడు ‘ది బర్త్‌ అండ్‌ గ్రోత్‌ అఫ్‌ ఇండియన్‌ ఐటీ ఇండస్ట్రీ’ అనే గ్రంథం ఒకటి లభ్యమైంది. భారతదేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) అభివృద్దికి తోడయ్యేలా, దానికి కృషి చేసిన మహనీయులను గుర్తుచేసే ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అదలా ఉంచితే, అసలు సైబరాబాద్‌ను చంద్రబాబే నిర్మించారా? ఆయన పదే పదే చెబుతున్నట్టు అక్కడ ఉన్న కట్టడాలన్నీ ఆయన హయాంలో పూర్తయి సైబరాబాద్‌గా రూపాంతరం చెందిందా? ఈ అనుమానం కూడా రావడంతో వాస్తవాలు కనిపెట్టేందుకు ‘సాక్షి’ గూగల్‌ ఎర్త్‌ను శోధించిననప్పుడు అవన్నీ బూటకమని, బాబు హయాంలో సైబర్‌ టవర్‌ మినహా ఎలాంటి కట్టడం లేదని నిర్ధారణ అయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన చర్యల కారణంగా 2010 నాటికి సైబరాబాద్‌ పూర్తి స్థాయిలో నిర్మితమైంది.

1987లోనే హైదరాబాద్‌లో ‘ఇంటర్‌గ్రాఫ్‌’ సంస్థ...
హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల ఏర్పాటు 1987లోనే ప్రారంభమైంది. పీవీ నరసింహారావు 1991లో ప్రధానమంత్రి అయ్యాక దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఐటీ పాలసీని తీసుకొచ్చి అమీర్‌పేటలోని మైత్రీవనంలో ఐటీ కంపెనీలకు స్థలం కేటాయించారు. మొదటి సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఏర్పాటైంది కూడా మైత్రీవనంలోనే. కంప్యూటర్లు అనగానే గుర్తుకువచ్చే కంప్యూటర్‌ మెయింటెనెన్స్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కూడా ఇక్కడే ఏర్పాటైంది. అంతకంటే ఐదేళ్ల ముందు 1987 ఆగస్టులో హైదరాబాద్‌లో ఇంటర్‌గ్రాఫ్‌ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కంపెనీ ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటి. అదే సంవత్సరం రామలింగరాజు తన సమీప బంధువులతో కలిసి సికింద్రాబాద్‌లో ‘సత్యం’ కంప్యూటర్స్‌ను ప్రారంభించారు. అది దినదినాభివృద్ది చెంది 1992లో పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లింది. తర్వాత దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఆవిర్భవించింది. ఈ తరుణంలోనే హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు పలువురు ముందుకు రావడంతో 1993లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మాదాపూర్‌లో సైబర్‌ టవర్స్‌తోపాటు అక్కడ ఐటీ పరిశ్రమకు అవసరమైన మేరకు భూములు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఎందుకీ ఉత్తుత్తి గొప్పలు?
కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటీ రంగంలో వాయువేగంతో దూసుకుపోవడానికి తన వంతు సాయపడ్డ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణ అందుకు తానే కారణమని ఏనాడు చెప్పలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి తమ వంతు ఐటీ వృద్దికి ఊతమిచ్చినా ఎవరూ చంద్రబాబు మాదిరి గొప్పలు చెప్పుకోలేదు. మరి చంద్రబాబు మాత్రమే పదేపదే ఈ దేశంలో తాను లేకపోతే ఐటీ లేదన్న రీతిలో ఎందుకు మాట్లాడుతున్నారు? వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేనాటికి ఐటీ రంగంలో హైదరాబాద్‌ దేశంలో 8వ స్థానంలో ఉంది. తెలుగు ప్రజలకు కంప్యూటర్‌ విజ్ఞానాన్ని తానే నేర్పానని కూడా బాబు పదేపదే చెబుతుంటారు. కానీ అది కూడా ఒట్టిదే అని తేలిపోయింది. దేశాభివృద్దికి సాఫ్ట్‌వేర్‌ ఊతమిస్తుందని భావించచడంతో పాటు నిరుద్యోగ నిర్మూలనకు తోడ్పడుతుందన్న భావనతో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మొదటి దశలోనే 1992లో హైదరాబాద్‌కు ఆరు సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కులు మంజూరు చేశారు. కేంద్ర సమాచార పౌర సంబంధాల శాఖకు అనుబంధంగా ఏర్పడ్డ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) మంత్రిత్వ శాఖ తొలుత అమీర్‌పేటలోనే ఎస్‌టీపీఐని ఏర్పాటు చేసింది. దేశంలోనే ఇది మొదటిసారి. ఇంత ముందుచూపుతో పీవీ వ్యవహరించినా ఆ తర్వాత మూడేళ్లకు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు దానిని పట్టించుకోలేదు.

వారిది దూరదృష్టి.. చంద్రబాబుది ‘రియల్‌’ దృష్టి 
1995లో తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి పొరుగున ఉన్న కర్ణాటక రాజధాని బెంగుళూరు ఐటీ రంగంలో దూసుకుపోతున్నా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. పైగా దూరదృష్టితో భవనాలు నిర్మించాలని, భూములు కేటాయించాలని అంతకుముందు ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి తీసుకున్న నిర్ణయాలను సమీక్షించిన చంద్రబాబు.. మొదట ఐటీ రంగాన్ని అభివృద్ది చేయాలనే విషయాన్ని పక్కనపెట్టి, ‘రియల్‌ ఎస్టేట్‌’ కోసం దానిని ఉపయోగించుకున్నారు. ప్రిన్స్‌టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ ఇంటర్నేషనల్‌ అండ్‌ రీజనల్‌ స్టడీస్‌కు చెందిన రీసెర్చ్‌ స్కాలర్‌ దలేల్‌ బెన్‌బలాలీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె ఏడాది పొడవునా మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో పర్యటించి చంద్రబాబు తన కోసం, తన సొంత సామాజికవర్గానికి చెందినవారి కోసం భూములను ఏ విధంగా కొనిపించిందీ, ఆ తర్వాత సైబర్‌ టవర్స్‌ నిర్మాణానికి ఎలా పూనుకున్నదీ పూసగుచ్చినట్లు వివరించారు.

సైబర్‌ టవర్స్‌ శంకుస్థాపనకు ముందే మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నల్లగండ్ల ప్రాంతాల్లో చంద్రబాబు భూములు కొనుగోలు చేయడంతోపాటు తన బినామీల ద్వారా కూడా భారీగా భూములు కొనుగోలు చేయించారు. అక్కడ ఐటీ పరిశ్రమ వస్తుందని తెలియని వందలాది మంది పేదలు తమ భూములను అత్తెసరు ధరకు అమ్ముకున్నారు. పేదల భూములు కాజేయడం ఒక ఎత్తయితే, దశాబ్దాల తరబడి ప్రభుత్వ భూములు సాగుచేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారు. అదే క్రమంలో తన, తన బినామీల భూముల ధరలు పెరిగేందుకు వీలుగా సైబర్‌ టవర్స్‌ నిర్మాణం చేపట్టారు. టెండర్లు లేకుండా దానిని ఎల్‌అండ్‌టీకి కేటాయించి, భారీగా నజరానాలు కూడా పొందారు.

సైబరాబాద్‌ నిర్మాత బాబు కానే కాదు..
బాబు ఆపధర్మ సీఎంగా మారిపోయే నాటికి సైబరాబాద్‌ ప్రాంతంలో ఒక్క సైబర్‌ టవర్స్‌ తప్ప మరో నిర్మాణం లేదు. అలాంటప్పుడు ఆయన సైబరాబాద్‌ నిర్మాత ఎలా అవుతారు? సైబరాబాద్‌ ప్రాంతం ఒక నగరంగా రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే. వాయువేగంతో ఆయన తీసుకున్న చర్యల కారణంగా హైటెక్‌ సిటీ నిర్మాణం 2008 నాటికి తుది దశకు చేరుకుని కంపెనీలు పని చేయడం మొదలుపెట్టాయి. చంద్రబాబు హయాంలో ఫైనాన్సియల్‌ జిల్లా ప్రతిపాదనేదీ లేదు. అలాంటప్పుడు తానే నిర్మించానని ఎందుకు చెబుతున్నారు? ఇంతకాలంహైదరాబాద్‌ను తానే కట్టానని చెప్పిన చంద్రబాబుకు అకస్మాత్తుగా తన దృష్టిని సైబరాబాద్‌ మీదకు ఎందుకు మళ్లించారు? దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విసిరిన ఓ పంచ్‌ కారణం.

చంద్రబాబు హైదరాబాద్‌ కడితే కులీఖుతుబ్‌షా ఏం కట్టారన్న ప్రశ్నకు చంద్రబాబు దిమ్మె తిరిగింది. ఆ వెంటనే సైబరాబాద్‌ తానే కట్టానన్న పల్లవి అందుకున్నారు. కానీ, చంద్రబాబు దిగిపోయే నాటికి హైటెక్‌ సిటీ మొదటి దశ కూడా ప్రారంభం కాలేదు. ఫైనాన్షియల్‌ జిల్లా ఊసే లేదు. దానికి మించి ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదన కూడా లేదు. ఇవన్నీ వైఎస్సార్‌ హయాంలో ఊపిరి పోసుకున్నవే. 2003 నాటి గూగుల్‌ చిత్రాలు చూస్తే ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. వైఎస్సార్‌ హయాంలో ఊపిరి పోసుకున్న సైబరాబాద్‌.. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన ఆరేళ్లకు గానీ నగరంగా రూపాంతరం చెందలేదు.

- మరి చంద్రబాబు మాత్రమే ఎందుకు పదేపదే అవాస్తవాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు? 
- తనకు సంబంధం లేని అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, హైదరాబాద్‌ మెట్రో తన ఘనతేనని ఎందుకు డప్పు వేసుకుంటున్నారు? 
- హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టానని,దానికి హైటెక్‌ సిటీయే నిదర్శనమని ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు? 
- సైబరాబాద్‌ను తానే సృష్టించానని చెప్పుకోవడం, ఆ ఘనతను సొంతం చేసుకోవడానికి ఎందుకంత తాపత్రయం చెందుతున్నారు? 

ఇది 2004 మే నెలలో నానక్‌రామ్‌గూడ ప్రాంతపు గూగుల్‌ ఫొటో. అప్పుడు ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఇంకా మొదలే కాలేదని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు