కన్నీటి సాగరమైన గార్లదిన్నె

21 Dec, 2018 12:58 IST|Sakshi
మీనాక్షి, చిన్నారుల మృతదేహాలు వ్యాన్‌లో ఉన్న మృతదేహాలను చూసేందుకు వచ్చిన జనం

అశ్రునయనాల నడుమ తల్లీపిల్లల అంత్యక్రియలు

అనంతపురం,గార్లదిన్నె: బోసినవ్వులు, అమాయకపు చూపులతో అందరినీ సంతోష సాగరంలో ముంచిన ఆ చిన్నారులు.. తెల్లటి వస్త్రంలో నిస్తేజంగా ఉండడాన్ని చూసిన జనం కన్నీటిసాగరంలో మునిగిపోయారు. చిన్నారులను చంపడానికి చేతులెలా వచ్చాయంటూ శాపనార్థాలు పెట్టారు. దారుణహత్యకు గురైన మీనాక్షి, ఆమె పిల్లలు కీర్తి, వితేష్‌ మృతదేహాలు పోస్టుమార్టం అనంతరం గురువారం మండల కేంద్రానికి తరలించారు.  స్థానికులు మృతదేహాలను చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారి మృతదేహాలను చూసి చలించిపోయారు. మీనాక్షి తల్లిదండ్రులు  కుమార్తె, మనమడు, మనమరాలును చూసి కన్నీటి పర్యంతమయ్యారు.  అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.

త్వరలో కేసు ఛేదిస్తాం
మీనాక్షి, ఆమె పిల్లల హత్య కేసును త్వరలో ఛేదిస్తామని ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. మృతురాలి భర్త నల్లప్ప ఫిర్యాదు మేరకు అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మీనాక్ష్మి చిన్నాన్న కుమారుడు హరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే మీనాక్షిని హత్య చేశానని నిందితుడు చెప్పినట్లు సమాచారం. మీనాక్షి, ఆమె పిల్లలను చంపుతానని ఆమె భర్తను నిందితుడు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు