పట్టాలెక్కని రైల్వే ప్రగతి

1 Dec, 2014 02:00 IST|Sakshi
పట్టాలెక్కని రైల్వే ప్రగతి

శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గం ప్రతిపాదనలకే పరిమితం
కృష్ణపట్నం-ఓబులాపురం మార్గానికి పూర్తికాని భూసేకరణ
బిట్రగుంటలో కలగా మారిన కాంక్రీట్ స్లీపర్ల తయారీ నిర్మాణం
వచ్చే బడ్జెట్‌లోనైనా నిధుల కేటాయింపులుపై ఆశలు

నెల్లూరు (రవాణా) : జిల్లాలో రైల్వే ప్రగతి ప్రతిపాదనలకే పరిమితమైంది. దశాబ్దాలుగా రైల్వే ప్రగతి ప్రణాళికకు మోక్షం లభించడం లేదు. ఎన్నో ఏళ్లుగా శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గం కలగానే మిగిలింది. కృష్ణపట్నం- ఓబులాపురం మధ్య రైలు పట్టాలు మధ్యలోనే ఆగిపోయాయి. బిట్రగుంటలో కాంక్రీట్ స్లీపర్ల తయారీ యూనిట్ శిలాఫలకానికే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ తరువాత రైల్వేకు అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టేది నెల్లూరు జిల్లానే. సుమారు ఏడాదికి రూ.1500 కోట్లు రాబడిని రైల్వేకు ఆర్జించి పెడుతోంది.

ప్రతిసారి బడ్జెట్‌లో కేంద్రం జిల్లాకు మొండి చెయ్యే చూపెడుతోంది. ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వంలో నెల్లూరు వాసి వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి స్థానంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సారైన బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి పడకేసిన రైల్వే ప్రగతిని పరుగెత్తిస్తారని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైల్వేశాఖ ఆయా జిల్లాల్లో ప్రతిపాదనలు పంపాలని ఎంపీలకు లేఖ రాయడంతో జిల్లా ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు మాత్రం ఈ సారి తప్పకుండా జిల్లాకు నిధులు కేటాయింపులపై పట్టుబడుతున్నారు.
 
శ్రీకాళహస్తి-నడికుడి ప్రతిపాదనలకే పరిమితం
జిల్లాలో ప్రధానంగా మెట్ట ప్రాంతాలను కలుపుతూ శ్రీకాళహస్తి నుంచి గుంటూరు జిల్లా నడికుడి వరకు రైలుమార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు 2010-11 బడ్జెట్‌లో మోక్షం లభించింది. శ్రీకాళహస్తి నుంచి రాపూరు, ఆత్మకూరు, వింజమూరు, కనిగిరి తదితర మెట్ట ప్రాంతాల మీదుగా రైల్వేలైన్ వేయాలని నిర్ణయించారు. అంతకు ముందు 2005లో ఈ మార్గానికి ప్రాథమిక సర్వే నిర్వహించారు. అనంతరం 2007లో మళ్లీ పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించారు. ఈ మార్గం నిర్మాణానికి సుమారు రూ.1310 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో భాగంగా రైల్వే మార్గంకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఇందుకు 2012లో కేంద్ర ప్రభుత్వం రూ. 8 లక్షలు కేటాయించారు. కానీ అక్కడ నుంచి ఏ మాత్రం ప్రగతి లేదు.
 
గూడూరు - దుగ్గరాజపట్నం రైల్వేలైన్ పరిస్థితీ ఇదే..
జిల్లాలో గూడూరు నుంచి దుగ్గరాజుపట్నం వరకు రైలు మార్గాన్ని వేయాలని ప్రతిపాదనలు చేశారు. ఆ మేరకు సర్వే కూడా పూర్తి చేశారు. 2010-11లో రెల్వేలైన్‌కు అయ్యేఖర్చును రూ. 278 కోట్లుగా అంచనా వేశారు. దీనికి సంబంధించి 2013లో రైల్వే బడ్జెట్‌లో నామమాత్రంగా రూ. కోటి కేటాయించారు. ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.
 
కృష్ణపట్నం-ఓబులాపురం లైన్‌కు పూర్తిగాని భూసేకరణ  
జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు నుంచి ప్రధానంగా బొగ్గు, యూరియా, బియ్యం, ఇనుము తదితర సరుకులు ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. వీటిని తరలించేందుకు కృష్ణపట్నం నుంచి కడప జిల్లా ఓబులాపురం వరకు రైల్వేలైన్ వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో సర్వే చేశారు. నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.930 కోట్లుగా అంచనా వేశారు. ఇందుకు గాను 2011లో మొదటి విడతగా రూ.6 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కృష్ణపట్నం నుంచి వెంకటాచలం వరకు రెండు లైన్లతో కూడిన ట్రాక్‌ను నిర్మించారు. ఈ రైలు మార్గానికి ప్రధానంగా భూసేకరణ అడ్డంకిగా మారింది. ఇప్పటికీ భూసేకరణ పూర్తికాలేదు.
 
కలగామారిన కాంక్రీట్ స్లీపర్ల తయారీ కర్మాగారం
జిల్లాలో బ్రిటీష్ కాలంలో బిట్రగుంట కేంద్రంగా రైల్వే శాఖ విస్తరించింది. కాలక్రమేణ బిట్రగుంటకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇప్పటికీ బిట్రగుంటలో రైల్వేకు సంబంధించి దాదాపు 1,600 ఎకరాల భూమి ఉంది. ఇతర అనేక వనరులు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేస్తూ రైల్వే పరమైన అభివృద్ధి కోసం 2004 సెప్టెంబర్ 17న అప్పటి కేంద్ర రైల్వే మంత్రి లాలూప్రసాద్‌యాదవ్ కాంక్రీట్ స్వీపర్ల తయారీ కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో రైలు ఇంజన్ల మరమ్మతుల కర్మాగారాన్ని (ఎలక్ట్రికల్ లోకో పిరియాడికల్ ఓవర్ హోలింగ్)  గత పదేళ్లుగా రైల్వేబోర్డు పరిశీలనలో ఉన్నప్పటికి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ ప్రాంతంలో కర్మాగారం స్థాపించినట్లయితే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు, కోట్లాది రూపాయిల విలువ జేసే రైల్వే ఆస్తులు, వనరులు సద్వినియోగంలోకి వస్తాయి. రైల్వేశాఖలో బంగారు గనిగా భావించే నెల్లూరు జిల్లాకు ఎన్నో ఏళ్లుగా అన్యాయం జరుగుతునే ఉంది.
 
ఏ గ్రేడ్ స్టేషన్ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం
ప్రస్తుతం ఏ1 స్టేషన్‌గా ఉన్న నెల్లూరును ఏ గ్రేడ్‌గా చేయాలనే ప్రతిపాదనలు కూడా కాగితాలకే పరిమితమైంది. ప్రయాణికుల రాకపోకలు, రవాణా విభాగంలో అత్యధిక ఆదాయం తెచ్చేపెట్టేది నెల్లూరు రైల్వేస్టేషన్ ఏ గ్రేడ్ స్టేషన్‌గా మార్చినట్లయితే నగరాలకు ఉండే సౌకర్యాలు జిల్లా వాసులకు లభిస్తాయి. గూడూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే సింహపురి రైలు బయలుదేరే సమయం పొడిగించడంతో జిల్లా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకు ముందు గూడూరులో రాత్రి 9 గంటలకు బయలు దేరే రైలు సమయాన్ని ప్రస్తుతం 10.40 మార్చడంతో సికింద్రాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చేరుతుందని పలువురు చెబుతున్నారు. రైలు సమయం మార్పుపై నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి రైల్వే అధికారులను కలిసి వినితిపత్రం సమర్పించారు. గతంలో ఉన్న సమయాన్నే పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
 
శ్రీకాళహస్తి -నడికుడి వరకు కొత్త లైన్ ఏర్పాటు చేయాలి
శ్రీకాళహస్తి నుంచి నడికుడి వరకు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేయాలి. సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌లో సబ్‌వేను ఏర్పాటు చేయాలి. నాయుడుపేట, సూళ్లూరుపేట రైల్వేస్టేషన్లల్లో ముఖ్యమైన ైరె ళ్లను ఆపాలి. దొరవారిసత్రం వద్ద రైల్వేప్లాట్‌ఫాం, ఆరంబాకం- తడ మధ్య ఉన్న కారూరు వద్ద కొత్తగా రైల్వేస్టేషనును ఏర్పాటు చేయాలి. వీలైనంత త్వరగా ఈ ప్రతిపాదనలు అమలు చేయాలి.
 - వి. వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ ఎంపీ, తిరుపతి
 
ప్రతిసారి అన్యాయం జరుగుతోంది
రైల్వే బడ్జెట్‌లో నెల్లూరు జిల్లాకు ప్రతిసారి అన్యా యం జరుగుతుంది. మూడు దశబ్దాలుగా ఎన్నో ఉద్యమాలు చేశాం. ఈ సారి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై ఆశలు పెట్టుకున్నాం. బిట్రగుంటలో రైల్వే ఆస్తుల వినియోగంలో భాగంగా ఎలక్ట్రికల్ లోకో పీఓహెచ్ ఏర్పాటు చేయాలి. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన రైల్వే కొత్త మార్గాలను త్వరితగతిన నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలి. నెల్లూరు స్టేషన్‌ను ఏ గ్రేడ్‌గా పరిగణించి అన్ని సదుపాయాలు కల్పించాలి.
 - జయరాజ్, బీజేపీ దళితమోర్చా జిల్లా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు