8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభం

4 Jun, 2020 15:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జూన్‌ 8వ తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు  మంత్రులు అవంతి శ్రీనివాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ హోటళ్ల యాజమాన్యాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్-19 నివారణ చర్యలు పాటిస్తూ హోటళ్ల నిర్వహణ అంశాలపై యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. 'ఎనిమిదో తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు.. రెస్టారెంట్లు ప్రారంభించవచ్చు. ఏపీలో అతిపెద్ద కోస్తా తీరం.. సుందర నదులు.. టూరిస్ట్ స్పాట్లు చాలా ఉన్నాయి. అన్ని చోట్లా హోటళ్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నాం. పుణ్య క్షేత్రాల్లో కూడా హోటళ్లను తెరిచేలా చర్యలు తీసుకుంటాం. టూరిస్టులు, యాత్రీకుల వసతి కోసం హోటళ్లు నిర్వహిస్తూనే కోవిడ్ నివారణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. దాదాపు ప్రతి జిల్లాలోనూ టూరిజం ప్రమోషన్లో భాగంగా వివిధ ఫెస్టివల్స్ నిర్వహించాం.(బాబు దళితులను హేళన చేశారు: మేరుగ)

పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చాలనే అంశంపై కసరత్తు చేస్తున్నాం. అరకు, గండికోట, హర్సలీహిల్స్ వంటి ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెనెన్ స్టార్ రిసార్ట్స్ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నాం. లాక్ డౌన్ సమయంలో నెలకు రూ. 10 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయాం. బోట్ ఆపరేటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.తొమ్మిది కమాండ్ కంట్రోల్ రూముల ఏర్పాటు చేయనున్నాం. త్వరలోనే కమాండ్ కంట్రోల్ రూములను కూడా ప్రారంభిస్తామంటూ' అవంతి శ్రీనివాస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు