ఆన్‌లైన్‌లో ఇంటిపన్ను వివరాలు

12 Jul, 2018 12:01 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న డీపీఓసత్యనారాయణ 

రామభద్రపురం(బొబ్బిలి): జిల్లాలో ఇప్పటివరకూ చేపట్టిన ఇంటిపన్ను వసూళ్ల వివరాలను తక్షణమే ఆన్‌లైన్‌లో పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) బి సత్యనారాయణ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ  కార్యాలయంలో నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో రూ.15 కోట్లు ఇంటి పన్ను డిమాండ్‌ ఉండగా రూ.12 కోట్లు వసూలైందన్నారు. ఇందులో రూ.5 కోట్లు ఆన్‌లైన్‌లో పెట్టారని, మిగతా రూ.7 కోట్లు ఆన్‌లైన్‌లో పెట్టాల్సి ఉందన్నారు. ఈనెలాఖరు లోగా ఆన్‌లైన్‌లో పెట్టని కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో మొత్తం 3,86,000 ఇళ్లు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 1510 కిలోమీటర్ల కాలువల్లో పూడికలు తొలగించామన్నారు. ఇందులో 175 కిలోమీటర్లు మాత్రమే ఆన్‌లైన్‌ చేశారని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైనందున కాలువల్లో మురుగు నీల్వ ఉండకుండా పూర్తిగా తొలగించాలని డీపీఓ ఆదేశించారు.

ప్రజలు రోగాలకు గురైతే కార్యదర్శులదే బాధ్యతని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను పరిశీలించాల్సిన బాధ్యత ఈఓపీఆర్డీలదేనన్నారు. పంచాయతీ ఖర్చులనకు సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచాలని, చంద్రన్న పెళ్లికానుకకు కావాల్సిన వివాహ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో ఇవ్వాలని సూచించారు.

జిల్లాల్లో 669 చెత్తశుద్ధి కేంద్రాల నిర్మాణాలు ప్రారంభించగా వాటిలో 129 పూర్తి చేశామన్నారు. 50 కేంద్రాల్లో వర్మీకంపోస్టు తయారు చేస్తున్నట్లు డీపీఓ తెలిపారు.

మరిన్ని వార్తలు