బెజవాడ లాయర్లకు అమరావతిలో ఇళ్లస్థలాలు!

4 Dec, 2015 15:50 IST|Sakshi
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం బెజవాడ బార్ అసోసియేషన్‌పై అమితమైన ప్రేమచూపింది. నూతన రాజధానిలో నిర్మించే జస్టిస్ సిటీలో బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది. ఈ మేరకు గురువారం బెజవాడ బార్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న న్యాయవాదులకు మొబైల్ మెసేజ్‌లు వచ్చాయి. అమరావతి నగరంలో జస్టిస్ సిటీ ఏర్పాటు చేసేందుకు సీఆర్‌డిఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ తర్వాత సింగపూర్ బృందం ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌లో జస్టిస్ సిటీని చేర్చారు. జస్టిస్ సిటీలో హైకోర్టు న్యాయమూర్తులకు నివాస గృహలు, న్యాయశాఖ సిబ్బందికి క్వార్టర్లు, ఇంకా స్థలాలు మిగిలితే హైకోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని గతంలో ప్రకటించారు.
 
ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అమరావతి నగరం శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సీఆర్‌డీఏ అధికారులు మాస్టర్ ప్లాన్ గురించి వివరించి జస్టిస్ సిటీలో నిర్మించనున్న కట్టడాల వివరాలను వెల్లడించారు. బెజవాడ బార్ అసోసియేషన్‌లో 2,300 మంది న్యాయవాదులు ఉన్నారు.  ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా అమరావతిలో బెజవాడ బార్ న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు. ఆసక్తిగల సభ్యులు తమ దరఖాస్తులను బార్ అసోసియేషన్‌లో తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా బార్ కార్యాలయం సూచించింది వాస్తవానికి గుంటూరు జిల్లాలో అమరావతి నగరం నిర్మితమవుతోంది. అయితే గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులను కనీసం పట్టించుకోకుండా విజయవాడకే ప్రాధాన్యం ఇవ్వడంపై మిగిలిన బార్ అసోసియేషన్లలో తీవ్ర వ్యతిరేక వ్యక్తం అవుతోంది. విశాఖపట్నం, కర్నూలు జిల్లాల న్యాయవాదులు హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్ డిమాండ్‌తో సుదీర్ఘ కాలం పోరాడారు. ఇలా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో న్యాయవాదులను పట్టించుకోకుండా కేవలం ఒక బార్ అసోసియేషన్‌పై ప్రేమ చూపడం న్యాయవాదుల్లో చర్చగా మారింది.
>
మరిన్ని వార్తలు