కలిసుండడం ఎలా సాధ్యం?

9 Sep, 2013 03:44 IST|Sakshi
కరీంనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజలపై దాడులు చేస్తూనే సమైక్యంగా ఉందామంటున్నారని, ఇది ఎలా సాధ్యమవుతుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి అన్నారు. కరీంనగర్‌లో సహచర మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలసి ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘జై తెలంగాణ’ అంటూ నినదించిన పోలీస్ కానిస్టేబుల్‌పైన, విద్యార్థులపైన సీమాంధ్ర నేతల, ప్రజలు దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. వందలమంది ఒక్కరినే కిందపడేసి దారుణంగా దాడి చేయడం అమానుషమన్నారు. తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉండడం వల్లనే హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్యాంధ్ర సభ విజయవంతం అయిందన్నారు. దీన్ని సాకుగా చూపి మిలియన్ మార్చ్ పేరుతో మరో సభ పెట్టాలనుకోవడం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమే అవుతుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్తామని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఇచ్చిన మాటకు తిరుగులేదని, ఎవరెన్ని కుట్రలు చేసినా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు కావడం ఖాయమన్నారు. 
 
మరిన్ని వార్తలు