‘అబద్ధాల వల్లే హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చింది’

24 Dec, 2019 11:35 IST|Sakshi

సాక్షి, విశాఖపట్టణం : ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి చంద్రబాబు, దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్రలాంటి వారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి మంగళవారం ధ్వజమెత్తారు. 14 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా దుర్మార్గ పాలన నడిపారని విమర్శించారు. విశాఖలోని ఎయిర్‌పోర్టు, ఫార్మాసిటీ, నౌకాశ్రయం, అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లు వైఎస్సార్‌ హయాంలోనే వృద్థి చెందాయని, ఆయన మరణానంతరం విశాఖ అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. నగరానికి ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వస్తే ఏదో జరిగిపోయినట్టు హడావిడి చేస్తున్నారని, ఉత్తరాంధ్రపై దుష్ప్రచారం ఆపాలని కోరారు. లేకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. అతి తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం అవుతుందని ముఖ్యమంత్రి విశాఖను ఎంచుకున్నారని, కక్షతో మాకొచ్చే అవకాశాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పాలన అంతా అబద్దాలతోనే సాగిందని, ఆ అబద్దాల వల్లే హుద్‌హుద్‌ లాంటివి వచ్చాయని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు మీ అభిప్రాయన్ని మీ నాయకులకు తెలియజేయాలని ప్రసాదరెడ్డి సూచించారు. మరోవైపు రైతుల పట్ల వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి ఉన్న కమిట్‌మెంట్‌ దేశంలో మరే నాయకుడికి లేదని ప్రశంసించారు. 

మరిన్ని వార్తలు