నాటు కోడికి పెరుగుతున్న క్రేజ్‌

5 Nov, 2019 09:12 IST|Sakshi

నాటు కోడి మాంసానికి పెరుగుతున్న డిమాండ్‌

బ్రాయిలర్‌ ‘చికెన్‌’పై మాంసం ప్రియుల అసంతృప్తి

బరువు కోసం హార్మోన్‌ ఇంజెక్షన్లు చేస్తున్నారని అనుమానాలు

పల్లెల్లో నాటు కోళ్ల పెంపకంపై ఆసక్తి 

ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది గానీ.. నాలుక మీద పడగానే ఆ రుచి అదిరిపోతుంది. పంటితో కొరికాక చూడాలి ఆ ముక్క మజాని.. కొన్ని క్షణాలు కళ్లు తెరిస్తే ఒట్టు. ఆ నాటు ఘాటును అలా హాయిగా ఆస్వాదించేస్తాం మరి. ఇగురైనా.. పులుసైనా.. చివరకు ఫ్రై అయినా.. ఆ టేస్టే వేరు. అందుకే తిన్నాక అంటాం.. తింటే నాటు కోడినే తినాలని. అందుకే ఇప్పటివరకూ కొంచెం దూరమైన ఆ రుచిని మాంసం ప్రియులు మళ్లీ కోరుకుంటున్నారు. బ్రాయిలర్‌కు బదులు ‘నాటు’కే ఓటేస్తున్నారు. 

సాక్షి, నెట్‌వర్క్‌: నాటు కోడి గుడ్డు.. మాంసాన్ని బలవర్ధక ఆహారంగా పరిగణిస్తారు. కానీ.. నాటు కోడి మాంసం గట్టిగా.. తినడానికి ఇబ్బందిగా ఉంటోందని వినియోగాన్ని తగ్గించేశారు. పల్లెల్లో సైతం మారిన జీవనశైలికి నాటుకోళ్ల పెంపకం భారం కావడంతో దాదాపు మానుకున్నారు. పల్లెల్లో సైతం బ్రాయిలర్‌ కోడి మాంసం అందుబాటులోకొచ్చింది. అందుకే ఇంతకాలం నాటుకోళ్లకు ప్రత్యామ్నాయంగా మాంసం ప్రియులు బ్రాయిలర్‌ కోడి మాంసానికి అలవాటుపడ్డారు. మెత్తగా.. తినడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో దీనినే ఎక్కువగా వినియోగిస్తూ వచ్చారు. అయితే ఇటీవల మాంసం ప్రియుల ఆహార అలవాట్లలో మార్పులొచ్చాయి. బరువు పెరగడానికి బ్రాయిలర్‌ కోళ్లకు ఇంజెక్షన్‌లు చేస్తున్నారనే అనుమానం పెరిగింది. హార్మోన్‌ ఇంజెక్షన్లతో నెల రోజుల కోడి పిల్లను రెండు, మూడు కేజీలకు పెంచుతున్న వైనాలూ వెలుగు చూస్తున్నాయి. మరోవైపు వాటి రుచి తగ్గిపోవడం వంటి కారణాలతో బ్రాయిలర్‌ మాంసం వినియోగాన్ని క్రమంగా తగ్గించేస్తున్నారు.  వారాంతంలో విధిగా నాటు కోడి మాంసం కొనుగోలుకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటికొచి్చన బంధువులకు, వివాహ విందులు, ఇతర కార్యక్రమాల్లో నాటు కోడి కూర వండి వడ్డిస్తున్నారు. 

కిలో రూ.400 నుంచి 500పైనే.. 
పల్లెటూళ్లలో పెంచుతున్న నాటుకోళ్లను పట్టణాలు, నగరాలకు తీసుకొచ్చి వారాంతంలో విక్రయిస్తున్నారు. పెంపకందార్లు నాటు కోడిని రూ.300 వరకు విక్రయిస్తుంటే.. మార్కెట్‌లో కిలో కోడిని రూ.400 నుంచి రూ.500కు పైగా అమ్ముతున్నారు. మార్కెట్‌లో మటన్, నాటు కోడి మాంసం ధరలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. నాటు కోడికి పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా ఇటీవల కాలంలో బ్రాయిలర్‌ కోళ్ల ఫారాలు మాదిరిగా నాటు కోళ్ల ఫారాలు పెరిగాయి. 

నాటు కోడి పులుసు రెడీ 
పట్టణాల్లో ఓ మోస్తరు హోటళ్లు మొదలుకుని.. విజయవాడ,విశాఖ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి తదితర నగరాల్లోని రెస్టారెంట్లు, స్టార్‌ హోటళ్లలో నాటు కోడి ఇగురు, పులుసును మెనూలో ప్రత్యేకంగా చూపుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో అన్ని రెస్టారెంట్లు, దాబాలు.. నాటు కోడి పులుసు, రాగి సంగటితో స్వాగతం పలుకుతున్నాయి. జాతీయ రహదారుల వెంట దాబాల్లో నాటు కోడికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 

కోళ్ల పెంపకంపై ఆసక్తితో..
సుదీర్‌రెడ్డి, వైఎస్సార్‌ జిల్లా, ఓబులవారిపల్లి మండలం, తల్లెంవారి పల్లె గ్రామ నివాసి. గతంలో ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. నాటు కోళ్ల పెంపకంపై ఆసక్తితో ఇటీవలే అక్కడ ఉద్యోగం మానేసి సొంతంగా రూ. 10 లక్షలతో ఫారం ఏర్పాటు చేశాడు. ఎలాంటి కృత్తిమ మందులు వాడకుండా పూర్తిగా సంప్రదాయ దాణాలతో దాదాపు 3,000 కోళ్లను పెంచుతున్నారు. ఆయన్ని పలకరించగా.. నాటు కోడి గుడ్లకు, మాంసానికి విపరీతమైన డిమాండ్‌ ఉందని, ప్రతి రోజూ ఫారం దగ్గరికే వచ్చి మాంస ప్రియులు నాటు కోళ్లను, గుడ్లను తీసుకెళ్తున్నారని చెబుతున్నారు.  వారాంతాలు, పండుగల్లో దూర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వస్తుంటారని వివరించాడు. ఒకసారి ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత నెలకు రూ. లక్ష వరకు లాభాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.  

నాణ్యతకు పెద్దపీట 
మా నాటు కోళ్ల ఫారం కర్నూలు సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. ప్రతి ఆదివారం కనీసం 50 మంది ఇక్కడికే వచ్చి నాటు కోళ్లు కొనుక్కెళ్తున్నారు. వినియోగదారులు డబ్బుకు వెనకాడటం లేదు. రుచి, నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. – వెంకటేశ్వర్లు, కర్నూలు 

సబ్సిడీపై కోళ్ల పిల్లలు 
గతంలో రైతులు పెరట్లో నాటు కోళ్లు విరివిగా పెంచేవారు. కాలక్రమేణా ఈ పెంపకం తగ్గింది. ఇటీవల కాలంలో రైతులు మళ్లీ నాటుకోళ్లు పెంపకంపై ఆసక్తి చూప్తున్నారు. ప్రతి జిల్లాలో చిన్న చిన్న ఫామ్‌లు వెలుస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా పెరటికోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి రైతుకూ సబ్సిడీపై 45 నాటుకోళ్ల పిల్లలను పంపిణీ చేస్తుంది.   – ఎన్‌.టి.శ్రీనివాస్, పశుసంవర్థకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ 

పోషక విలువలు అధికం 
నాటు కోళ్లలో తక్కువ ఖర్చుతో ఎక్కువ మాంసకృత్తులు లభిస్తాయి. నాటు కోడి గుడ్లు ఎక్కువ బలమైన ఆహారం. కోళ్లకు తరుచూ సీజనల్‌ వ్యాధులకు వ్యాకిన్స్‌లు వేయించుకోవాలి.     – డా‘‘ వి.అనురాధ, పశుసంవర్ధకశాఖ (వీబీఆర్‌ఐ) జెడీ, సామర్లకోట.

మాజీ సైనికుని ఇంట సిరుల పంట 
ఎర్రావారిపాళెం (చిత్తూరు జిల్లా): ఎర్రావారి మండలం కూరపర్తివారిపల్లిలో మాజీ సైనికుడు శ్రీనాథ్‌రెడ్డి కడక్‌నాథ్‌ రకంతోపాటు నాటు కోళ్లు పెంచుతున్నారు. మార్కెట్లో నాటు కోళ్లకు డిమాండ్‌ బాగుండటంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నట్టు శ్రీనాథ్‌రెడ్డి చెప్పారు. కోళ్లతోపాటు కోడిగుడ్లు, పిల్లల్ని కూడా అమ్ముతున్నట్టు వివరించారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని ధీమాగా చెప్పారు. 

రాష్ట్రంలో జీవాల గణాంకాలివీ.. (సుమారుగా..) 
లేయర్‌ కోళ్లు- 11,01,10,315
బ్రాయిలర్‌ కోళ్లు- 8,05,83,000 
నాటు కోళ్లు- 35,18,950 
మేకలు- 44,12,500 
గొర్రెలు- 1,35,04,350 
 

మరిన్ని వార్తలు