ఉలిక్కిపడ్డ ఆర్సీపురం

18 Dec, 2013 00:28 IST|Sakshi

రామచంద్రాపురం, న్యూస్‌లైన్: రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లోని బోన్సాయ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టెక్నిషియన్లు, ఇద్ద రు మహిళలు గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా వందలాది మంది ఆందోళనకు గురయ్యారు. అయితే గ్యాస్ కారణంగానే పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి నాలుగు ఫ్లాట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మూడో అంతస్తులో జరిగిన ఘటనతో కింది ఫ్లోర్(211)లో నివసిస్తున్న మహిళలిద్దరికి గాయాలు కావడంతో ఆసుపత్రిపాలయ్యారు. కాగా పేలుడు జరిగిన ఇంట్లో చాలా కాలంగా ఎవ్వరూ ఉండటంలేదు.
 
 రహీం, ఖమల్ అనే ఇద్దరు టెక్నిషియన్లు బోన్సాయ్ అపార్ట్‌మెంట్ మొత్తంలో ఇన్‌బిల్ట్ గ్యాస్ వ్యవస్థను మరమ్మతులు చేసేందుకు వచ్చారు. వారు ఇతర ఇళ్లల్లో గ్యాస్‌పైపులైన్ పనులను ముగించుకుని మూడో అంతస్తుకు వచ్చి ఇంటి (311) కాలింగ్ బెల్ నొక్కారు. సరిగ్గా అప్పుడే పేలుడు జరిగింది. గాయపడ్డ టెక్నీషియన్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ్యాస్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రెండో అంతస్తులో(312)లో ఉంటున్న వారు అప్పుడే బయటకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఆ ఫ్లాట్ గోడలు పూర్తిగా కూలిపోయాయి. మొత్తం అపార్ట్‌మెంట్‌లోని పలు ఫ్లాట్ల కిటికీల అద్దాలు పగిలాయి. లిఫ్టు ధ్వంసమైంది. పేలుడుతో ఆనుకుని ఉన్న ఇతర అపార్ట్‌మెంట్‌ల అద్దాలు, గోడలు కూడా ధ్వంసమయ్యాయి.   పేలుడు జరిగిన ఇంటి యజమాని ప్రకాశ్ అమర్‌లాల్ బజాజ్ ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ గదిలో ఎలాంటి సామగ్రిలేదు. జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. సంగారెడ్డి నుంచి క్లూస్‌టీం కూడా ఇక్కడకు చేరుకుని పరిశోధన నిర్వహించింది. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం వరకు వినిపించిందని ప్రజలు చెబుతున్నారు. ఘటన స్థలాన్ని సందర్శించిన వారిలో డీఎస్పీ కవిత, సీఐలు శ్రీనివాస్, భీంరెడ్డి, ఎస్‌ఐ రవీందర్‌రెడ్డిలు ఉన్నారు.
 
 గ్యాస్‌తోనే పేలుడు
 బోన్సాయ్ అపార్ట్‌మెంట్‌లో పేలుడుకు కారణం గ్యాసేనని పోలీసులు ని ర్ధారణకు వచ్చారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఇన్‌బిల్ట్ గ్యాస్ మెకానిక్ రహీంతో పోలీసు అధికారులు వివరాలు సేకరించారు. గ్యాస్ అన్ని ఫ్లాట్లకు సరఫరా అవుతున్నదీ లేనిదీ మెకానిక్ పరిశీలిస్తున్నాడు. కొం తమందికి గ్యాస్ రావడంలేదని తెలుసుకున్న మెకానిక్ ఫ్లాట్ నంబర్ 311 వద్దకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. ఆ ఫ్లాట్ యాజమాని కొన్ని నెలలుగా అందులో ఉండడంలేదు.  గ్యాస్‌వాల్వ్ ఓపెన్‌చేసి ఉండడం వల్ల గ్యాస్ అంతా రూంలో నిండి ఉండవచ్చునని, బెల్ కొట్టగానే పేలుడు జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు