గడప గడపలో ఘనస్వాగతం

9 Jul, 2016 01:21 IST|Sakshi

అట్టహాసంగా ప్రారంభమైన గడపగడపకు వైఎస్సార్
పలు నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు
ఇంటింటికీ పార్టీ శ్రేణులు
ప్రభుత్వ వైఫల్యాలపై ముద్రించిన కరపత్రాల పంపిణీ
ముదునూరులో సారథి, విజయవాడలో రాధాకృష్ణ లాంఛనంగా ప్రారంభం

 

విజయవాడ : గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జిల్లాలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లగా జనం నుంచి ఘన స్వాగతం లభించింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన విగ్రహాలకు నివాళి అర్పించి నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం ముదునూరులో, పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక ప్రాంతంలోని భ్రమరాంబపురంలో, సెంట్రల్ నియోజకవర్గంలోని కండ్రికలో పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ నేతృత్వంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ సర్కారు అడ్డగోలు వ్యవహారాలతో అన్ని వర్గాల ప్రజలకూ నష్టం చేస్తోందని మండిపడ్డారు. అడ్డగోలుగా అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చుతోందని, దీనిని తమ పార్టీ తరఫున ప్రజలకు అండగా ఉండి ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్, పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఊర్మిళా నగర్‌లో పార్టీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలోని ముదునూరులో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు పేద ప్రజల భూములు లాక్కోవటమే ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు దందాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. పార్టీ జిల్లా పరిషత్ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి పాల్గొన్నారు.


నూజివీడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు నేతృత్వంలో పట్టణంలోని 17, 18 వార్డుల్లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బసవా రేవతి, పార్టీ నాయకులు పాల్లొన్నారు.


పామర్రు నియోజకవర్గంలో పామర్రు మండలంలోని మల్లకూరు గ్రామంలో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కారక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు.


తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలం కొండపర్రులో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు.


జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు 16వ వార్డులో పార్టీ సమన్వయకర్త సామినేని ఉదయభాను గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యక్రమం నిర్వహించారు.


మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంలోని జూపూడి గ్రామంలో పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ నేతృత్వంలో గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు.


మచిలీపట్నంలోని కరగ్రహారంలో ఉన్న ఫరీద్ బాబా దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ సమన్వయకర్త పేర్ని నాని గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు.


నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం గుడిమెట్లలో పార్టీ సమన్వయకర్త్త మొండితోక జగన్‌మోహనరావు నేతృత్వంలో కార్యక్రమం ప్రారంభించారు.


కైకలూరులో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఈ కార్యక్రమం నిర్వహించారు.


పెడన పట్టణం ఏడో వార్డులో పార్టీ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాము నేతృత్వంలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు.


గన్నవరం నియోజకవర్గంలోని గొల్లనపల్లి గ్రామంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు.


అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు.

మరిన్ని వార్తలు