భారీగా రేషన్‌ బియ్యం పట్టివేత

16 Sep, 2019 09:32 IST|Sakshi
రేషన్‌ బియ్యం పట్టుబడిన టీడీపీ నేత రైస్‌మిల్లు

టీడీపీ నేత రైస్‌మిల్లులో 18.5 టన్నులు  పట్టుబడిన వైనం

ఉన్నతాధికారుల దొంగాట

24 గంటల సుదీర్ఘ విచారణ

సాక్షి, కావలి (నెల్లూరు): ఓ టీడీపీ నేత రైస్‌మిల్లులో 5.6 టన్నుల రేషన్‌ బియ్యంపట్టుబడిన విషయం మరువక ముందే మరో టీడీపీ నేతకు చెందిన రైస్‌ మిల్లులో భారీగా 18.5 టన్నుల బియ్యం పట్టుబడ్డాయి. పట్టణంలోని మద్దురుపాడులో ఉన్న టీడీపీ నేత పులి చక్రపాణికి చెందిన రైస్‌మిల్లులో భారీగా రేషన్‌ బియ్యం ఉన్నట్లు శనివారం సాయంత్రం కావలి రూరల్‌ పోలీసులకు సమాచారం అందడంతో మిల్లు వద్దకు చేరుకొన్నారు. మిల్లులో రేషన్‌ బియ్యంను పాలిష్‌ చేసి గుట్టగా పోసి ఉండగా గుర్తించారు. దీంతో పోలీసులు పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అయితే జిల్లా పౌరసరఫరాలశాఖ అధి కారి బాలకృష్ణారావు ఆదివారం మధ్యాహ్నం వరకు మిల్లు వద్దకు చేరుకోలేదు. తమకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో స్థానిక అధికారులు కాలక్షేపం చేశారు. అయితే పోలీసులు మాత్రం రైస్‌మిల్లులోని రేషన్‌ బియ్యం మాయం కాకుండా కాపలా పెట్టారు. ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం రేషన్‌ బియ్యంగా నిర్ధారించారు. పాలిష్‌ చేయడంతో అందులో 16 టన్నులు బియ్యం, 2.5 టన్నుల నూకలుగా లెక్కలు తేల్చి స్వాధీనం చేసుకొన్నారు. మిల్లు యజమాని, టీడీపీ నేత పులి చక్రపాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు