మహిళా కమిషన్‌ చెంతకు యువతులు

30 Apr, 2019 10:27 IST|Sakshi

బొమ్మూరు స్వధారహోమ్‌ నుంచి ప్రత్యేకవాహనంలో  తరలింపు

రాజమహేంద్రవరం రూరల్‌: అక్రమ రవాణా అనుమానంతో ముంబాయి వెళుతున్న రైలు నుంచి దించేసిన యువతులను ఒడిశా మహిళా కమిషన్‌ చెంతకు పంపించారు. ఈమేరకు సోమవారం సాయంత్రం బొమ్మూరులోని మహిళాప్రాంగణంలోని స్వధారహోమ్‌ నుంచి 17మంది యువతులను ప్రత్యేక పోలీసుఎస్కార్ట్‌ వాహనంలో ఐసీడీఎస్, రాష్ట్ర మహిళా కమిషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో పంపించారు. ఒడిశా రాష్ట్రంలో బరంపూర్‌జిల్లాకు చెందిన ముగ్గురు, గంజాజిల్లాకు చెందిన ఏడుగురు, కాండుజొరోజిల్లాకు చెందిన ఆరుగురు, బలుగర్‌జిల్లాకు చెందిన ఒక యువతి మొత్తం 17మంది యువతులు ఈనెల 27న కోణార్క్‌ఎక్స్‌ప్రెస్‌లో ఒడిశా నుంచి ముంబయి రైల్లో వెళుతున్నారు.

చైల్డ్‌లైన్‌ ఫోన్‌ నంబర్‌కు ఒక ప్రయాణికురాలు ఫోన్‌ చేయడంతో సామర్లకోట రైల్వేస్టేషన్‌లో చైల్డ్‌లైన్‌స్టాఫ్‌ దించే ప్రయత్నం చేశారు. అక్కడ దిగకపోవడంతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో ఆ యువతులను జీఆర్పీ పోలీసుల సహాయంతో రైలు నుంచి దించేసి టుటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు విచారణలో చేపలసీడ్‌ శుభ్రం చేసే పనికి వెళుతున్నట్టు తేలింది. దీంతో ఆయువతులను బొమ్మూరులోని స్వధార్‌హోమ్‌కు తరలించారు. ఆదివారం రాష్ట్రమహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, సభ్యురాలు డాక్టర్‌ శిరిగినీడిరాజ్యలక్ష్మి సందర్శించి ఆ యువతులను సురక్షితంగా ఒడిశా పంపించేందుకు పోలీసు, ఐసీడీఎస్‌ అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

సోమవారం రాష్ట్రమహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ శిరిగినీడి రాజ్యలక్ష్మి , చైరపర్సన్‌ నన్నపనేని రాజ్యకుమారి ఆదేశాల మేరకు ఐసీడీఎస్‌ అధికారులతో కలిసి ఒడిశా మహిళాకమిషన్‌తో చర్చించారు. అయితే ముందు ఒడిశా మహిళాకమిషన్‌ సభ్యులు తామే వచ్చి ఆ యువతులను తీసుకుని వెళతామని చెప్పారు. అయితే వారు వచ్చేందుకు సమయం పడుతుంది కావున, ఇక్కడి నుంచే యువతులను తీసుకుని వచ్చి అప్పగిస్తామని చెప్పారు. దీంతో అర్బన్‌ జిల్లా ఎస్పీ షిమోషిబాజ్‌పాయ్‌ ఆ యువతులను తరలించేందుకు పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం సమకూర్చి నలుగురుసిబ్బందిని ఏర్పాటు చేవారు. ఐ

సీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి సుఖజీవన్‌బాబు ఆదేశాల మేరకు ఏపీడీ మణెమ్మ ఒక్కొక్క యువతికి భోజనాలు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.500 అందజేశారు. ఆ యువతుల వెంట జిల్లా చైల్డ్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ వెంకట్రావు, సఖిమహిళాసభ్యులు, చైల్డ్‌లైన్‌ సిబ్బంది వెళ్లారు. ఈసందర్భంగా రాష్ట్ర మహిళాకమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఆయువతులను సురక్షితంగా ఒడిశా మహిళాకమిషన్‌కు అప్పగిస్తారని, అనంతరం అక్కడి నుంచి వారు ఆ యువతులను స్వస్థలాలకు పంపిస్తారని తెలిపారు. మహిళాప్రాంగణం మేనేజర్‌ పి.వెంకటలక్ష్మి, చైల్డ్‌లైన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు