మద్యం తాగొద్దని భార్య మందలించడంతో!

5 Jun, 2017 10:20 IST|Sakshi
మద్యం తాగొద్దని భార్య మందలించడంతో!
నెల్లూరు(క్రైమ్‌): మద్యం తాగొద్దని భార్య మందలించడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు నగరంలోని నవాబుపేట ఎన్‌సీ బాలయ్యనగర్‌కు చెందిన పీ. చెంచయ్య(32), లావణ్య భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. చెంచయ్య అదే ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. 
 
ఇటీవల ఆయనకు వైద్యులు అపెండిసైటిస్‌ శస్త్ర చికిత్స కూడా చేశారు. మద్యం సేవిస్తే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పలుమార్లు మద్యం సేవించి రావడంతో లావణ్య అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయినా అతను పట్టించుకోలేదు. ఈ నెల ఒకటిన చెంచయ్య ఫూటుగా మద్యం సేవించాడు.

మరోసారి తాగితే ఊరుకోనని లావణ్య అతనిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన చెంచయ్య చెదలు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పటినుంచి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించి రెండో నగర ఎస్‌ఐ తిరుపతయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
>
మరిన్ని వార్తలు