కాపురం నిలబెట్టండి

17 Oct, 2017 15:47 IST|Sakshi

కర్నూలు: భర్త వెంకటేష్‌ వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, తనకు ఒక కుమారుడు కూడా ఉన్నాడని, కౌన్సెలింగ్‌ ఇచ్చి కాపురం నిలబెట్టాలని నందికొట్కూరు పట్టణానికి చెందిన లక్ష్మీ ఎస్పీ గోపీనాథ్‌ జట్టికి ఫిర్యాదు చేసింది. సోమవారం  జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గోపీనాథ్‌ జట్టి ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు.

 డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 94407 95567కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను నోట్‌ చేసుకున్నారు. తన భర్త పేరుతో ఉన్న ఇంటిని అత్తమామలు, ఆడపడచు, ఆమె భర్త కలసి అమ్మేసి తమకు నిల్వ నీడ లేకుండా చేశారని శిరివెళ్లకు చెందిన మాధవి ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో ఉన్న తన భర్త చేత ఇంటి అమ్మకం పత్రాలపై సంతకాలు చేయించి అన్యాయం చేశారని, విచారణ జరిపించి న్యాయం చేయాల్సిందిగా ఆమె వినతిపత్రంలో కోరారు. అడిషనల్‌ ఎస్పీ షేక్‌షావలి, డీఎస్పీలు బాబుప్రసాద్, ఖాదర్‌ బాషా, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు