భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

28 Oct, 2018 11:38 IST|Sakshi

కర్నూలు జిల్లా / గడివేముల: కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. మండల పరిధిలోని పెసరవాయిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘటన వివరాలను ఎస్‌ఐ వెంకటేశ్వరరావు వెల్లడించారు. గ్రామానికి చెందిన స్వాములుకు 12ఏళ్ల క్రితం సుజాత(30)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా సుజాత ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో కలతలు వచ్చి, రోజూ గొడవ పడేవారు.  తాగుడుకు బానిసై వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు భరించలేక ఇటీవల  ఆమె తిరుపాడులో ఉన్న తన సోదరి రాజ్యలక్ష్మి వద్దకు వెళ్లింది.

 ఇక నుంచి గొడవ పడకుండా ఉందామని చెప్పి శుక్రవారం భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. అదే రోజు రాత్రి మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలో గొడ్డలితో తలపై నరికి పరారయ్యాడు. రక్తపు మరకల్లో విగత జీవిగా పడివున్న సుజాతను చూసి చుట్టుపక్కల వారు సోదరికి సమాచారం ఇచ్చారు. పాణ్యం సీఐ వాసుకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి అక్క రాజ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.   

మరిన్ని వార్తలు